ఇబ్రహీంపట్నంరూరల్ : దివ్యాంగుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, చేతులు తన సొంత నిధులతో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ ప్రమాదాలలో కాళ్లు, చేతులు కోల్పోయిన వికలాంగులకు కృత్రిమ కాళ్లు, చేతులు అందజేయడం నాకెంతో సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
నియోజకవర్గంలో కాళ్లు, చేతులు లేని దివ్యాంగులకు జనవరిలో సొంతంగా క్యాంపులు నిర్వహించి కృత్రిమ కాళ్లు, చేతులు అందజేస్తానన్నారు. దివ్యాంగులకు కాళ్లు, చేతులు అందజేసిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఎచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాళ్ల జంగయ్య, వికలాంగులు యాదయ్య, బాలరాజు, అశోక్, సలీం తదితరులు ఉన్నారు.
అంగన్వాడీలకు యూనిఫాం చీరల అందజేత..
అంగన్వాడీల ద్వారా ప్రతి చిన్నారి, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం పౌష్టికాహారం అందజేస్తుందని, ఈ ఆహారాన్ని వారికి చేరవేయటంలో అంగన్వాడీల పాత్ర మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పని చేస్తున్న 15మంది అంగన్వాడీ టీచర్లు, 10మంది ఆయాలకు యూనిఫాం చీరలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్, మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, సీడీపీవో సృజన తదితరులు ఉన్నారు.