తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా దారులన్నీ గులాబీమయమయ్యాయి. ఏ పల్లె చూసినా, పట్టణం చూసినా గులాబీ తోరణాలు, జెండాలతో కళకళలాడుతున్నాయి. నేడు మాదాపూర్లోని హైటెక్ సిటీలో జరిగే ప్లీనరీకి మంత్రి సబితారెడ్డి, ఇరు జిల్లాల జడ్పీ చైర్పర్సన్లు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జడ్పీటీసీలతో పాటు ఆహ్వానం అందిన పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు తరలివెళ్లనున్నారు. ప్లీనరీలో ఆహ్వానితులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉన్నందున ఊరూరా గులాబీ జెండాలను ఎగురవేసి సంబురాలు చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించడంతో పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. దీంతో అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల్లోనూ గులాబీ తోరణాలు కళకళలాడుతున్నాయి. పార్టీ జెండాలను ఎగురవేసేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు.
రంగారెడ్డి, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఏర్పాటైన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ నేటితో 21వ వసంతంలోకి అడుగు పెట్టనున్నది. ఒక్కడిగా మొదలైన టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ఇప్పుడు ఒక రాజకీయ శక్తిగా ఎదిగింది. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ మద్దతుతో టీఆర్ఎస్ పార్టీని ఉద్యమ సారథి, కేసీఆర్ ప్రకటించారు. తదనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని శక్తులు, సంఘాలను ఐక్యం చేస్తూ, ఉద్యమంతోపాటు రాజకీయంగా కూడా బలపడాలనే ఉద్దేశంతో తొలిసారిగా 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయగా 26 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలను తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి గెలిపించారు. ఈ విజయంతో అప్పటి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం కామన్ మినిమమ్ ప్రోగ్రామ్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చేర్చడంతో టీఆర్ఎస్ పార్టీ సాధించిన తొలి విజయంగా చెప్పవచ్చు. అదేవిధంగా 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 63 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా..2018లో జరిగిన ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ 88 స్థానాలను సాధించి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో దేశమంతా తెలంగాణ వైపు చూసేలా రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి ఘనత మాత్రం సీఎం కేసీఆర్దే.
ప్లీనరీకి తరలివెళ్లనున్న 97 మంది ప్రజాప్రతినిధులు
టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మాదాపూర్లోని హెచ్ఐసీసీలో జరుగనున్న పార్టీ ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా గులాబీమయంగా మారిం ది. అన్ని మండలాలు, నియోజకవర్గాల ప్రధాన కూడళ్లలో టీఆర్ఎస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. కాగా జిల్లా నుం చి ప్లీనరీకి 97 మంది టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు తరలివెళ్లనున్నారు. వారిలో జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, జడ్పీచైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్రెడ్డి, వాణీదేవి, దయానంద్, మల్లేశం, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మె ల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్యేలు యాదయ్య, అంజయ్యయాదవ్, జైపాల్యాదవ్, డీసీసీబీ, డీసీఎంఎస్ జిల్లా అధ్యక్షులు మనోహర్రెడ్డి, కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు, మండలాల అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు ఉన్నారు. అదేవిధంగా ప్లీనరీలో ఆహ్వాన కమిటీ చైర్మన్గా మంత్రి సబితాఇంద్రారెడ్డి, సభ్యులుగా ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఉన్నారు.
నేడు ఊరూరా పార్టీ జెండాల ఆవిష్కరణ
పరిగి, ఏప్రిల్ 26: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మాదాపూర్లోని హెచ్ఐసీసీలో జరుగనున్న పార్టీ ప్లీనరీకి వికారాబాద్ జిల్లా నుంచి టీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివెళ్లనున్నారు. ఆహ్వానం అందుకున్న వారే హాజరు కానున్నారు. వికారాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సునీతారె డ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్ట ర్ మెతుకు ఆనంద్, పరిగి, కొడంగల్, తాండూరు ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, రోహిత్రెడ్డి, పార్టీకి చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మండలాల పార్టీ అధ్యక్షులు, రైతుబంధు సమితి మండలాల అధ్యక్షులు తరలివెళ్లనున్నారు. ఉద్యమ పార్టీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి 21వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ ప్లీనరీని నిర్వహిస్తున్నారు. ప్లీనరీలో అనేక తీర్మానాలను ఆమోదించడంతోపాటు పార్టీ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అందుకు అనుగుణంగా పార్టీ యంత్రాంగం రానున్న ఎన్నికలకు సన్నద్ధం కానున్నది. టీఆర్ఎస్ ఆవిర్భా వ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఊరూరా పార్టీ జెండాలను ఆవిష్కరించి సంబురాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో పార్టీ జెండాలను ఎగురవేయనున్నారు.