రంగారెడ్డి, సెప్టెంబర్ 3, (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వానకాలం సాగు 3.70 లక్షల ఎకరాలుగా లెక్క తేలింది. జిల్లాలో ఆయా పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ పూర్తయింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆయా పంటల సాగు 20 వేల ఎకరాలమేర పెరిగింది. గతేడాది వానకాలం సీజన్తో పోలిస్తే ఈ ఏడాది పత్తి, మొక్కజొన్న పంటల సాగు గణనీయంగా పెరుగగా, వరి, కంది పంటల సాగు భారీగా తగ్గుముఖం పట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో పత్తి సాగు పెంచేందుకు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి మంచి డిమాండ్ ఉండడంతో ప్రభుత్వం పత్తి సాగు పెంచేలా రైతులకు సూచించింది. జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పత్తి సాగు 50 వేల ఎకరాలు పెరిగింది. గతేడాది కేవలం 20 వేల ఎకరాలకే పరిమితమైన మొక్కజొన్న పంట సాగు ఈ ఏడాది 53 వేల ఎకరాలకు పెరిగింది. మరోవైపు ఈ వానకాలం సీజన్లో జిల్లాలో ప్రతి ఏటా భారీగా సాగయ్యే కంది, వరి సాగు ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. గతేడాది 75 వేల ఎకరాల్లో సాగైన కంది పంట ఈ వానకాలం సీజన్లో 57 వేల ఎకరాలకుపైగా తగ్గగా, వరి సాగు 30 వేల ఎకరాల మేర తగ్గింది.
3.70 లక్షల ఎకరాల్లో పంటల సాగు
జిల్లావ్యాప్తంగా వానకాలం సీజన్లో 3.70 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యాయి. పత్తి, మొక్కజొన్న పంటల సాగు భారీగా పెరిగింది. పత్తి 1.70 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న పంట 73,182 ఎకరాల్లో సాగైంది. వరి లక్ష ఎకరాలు, కందులు 18వేలు, జొన్న 3403, రాగులు 12, మినుములు 25, పెసలు 79, చెరుకు 11, ఆముదం 22, సోయాబీన్ 58, వేరుశనగ 3, చిరుధాన్యాలు 8, ఇతర పంటలు 3500 ఎకరాల్లో సాగయ్యాయి.
400 ఎకరాల్లో సింగిల్ పిక్ పత్తి సాగు
జిల్లాలో ఈ ఏడాది ప్రయోగాత్మకంగా సింగిల్ పిక్ పత్తి రకాన్ని సాగు చేసేలా జిల్లా రైతాంగాన్ని వ్యవసాయాధికారులు ప్రోత్సహించారు. జిల్లాలోని ఆమనగల్లు, మాడ్గుల, మంచాల మండలాల్లో 400 ఎకరాల్లో సింగిల్ పిక్ పత్తి పంటను రైతులు సాగు చేశారు. ప్రతి ఏటా కూలీల కొరత సమస్యతో పత్తి సాగు చేసే రైతులు ఇబ్బందులు పడుతుండడంతో సింగిల్ పిక్ పత్తి సాగును ప్రభుత్వం తీసుకువచ్చింది.
సాధారణ పత్తి రకం కంటే అదనంగా దిగుబడి రావడంతోపాటు ఒకేసారి పత్తి తీస్తే సరిపోతుండడంతో సింగిల్ పిక్ పత్తి సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. సాధారణ పత్తి రకంతో పోలిస్తే సింగిల్ పిక్ పత్తి రకంతో ఎకరాకు 3-6 క్వింటాళ్లు అదనంగా దిగుబడి రానున్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాది నుంచి సింగిల్ పిక్ పత్తి రకం సాగును జిల్లాలో భారీగా పెంచనున్నారు.