ఇబ్రహీంపట్నం, ఆగస్టు 13 : మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడానికి ప్రభుత్వం ఎంతో కృషిచేస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన గంగపుత్ర సంఘం సభ్యులతో కలిసి ఇబ్రహీంపట్నం పెద్దచెరువు తూమువద్ద గంగాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మత్స్యకారులు తెప్పల ద్వారా చెరువులో గంగాదేవికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటల్లోకి వర్షపునీరు సమృద్ధిగా చేరడంతో ఇప్పటికే వాటిలో ప్రభుత్వం మొదటి విడుత చేపపిల్లలను వదిలిపెట్టిందన్నారు. మత్స్యకారుల అవసరాల మేరకు అవసరమైన చేపపిల్లలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో చేపపిల్లలను పెంచే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం ప్రాంత మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులను శాసించే ఇబ్రహీంపట్నం పెద్దచెరువు గత పదిహేనేండ్ల తర్వాత పూర్తిస్థాయిలో నిండిందని చెప్పారు. ఈ చెరువుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదు నుంచి ఆరు వందల మత్య్సకార కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. చెరువులో సమృద్ధిగా నీరు ఉండటంతో ఇబ్రహీంపట్నం, శేరిగూడ, ఉప్పరిగూడ గంగపుత్రులకు, ముదిరాజ్ సంఘాలకు ఉపాధి లభిస్తుందన్నారు. చెరువులో నీటిని స్టోరేజ్ ఉంచాలని నిర్ణయించామని.. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగే అవకాశాలున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం పెద్దచెరువుతోపాటు నియోజకవర్గంలోని పెద్దచెరువులన్నింటిలో చేపపిల్లలను వదులనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్ యాదగిరి, కౌన్సిలర్లు శ్వేత, సుజాత, జ్యోతి, మంగ, జగన్, గంగపుత్ర సంఘం నాయకుడు భీంరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాములు, మున్సిపల్ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు రాజు, టీఆర్ఎస్ నాయకులు, గంగపుత్ర సంఘం నాయకులు పాల్గొన్నారు.