తుర్కయాంజాల్, ఆగస్టు 11: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసాబ్ చెరువులోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. సుమారు 495 ఎకరాల్లో విస్తరించి ఉన్న చెరువును హెచ్ఎండీఏ అధికారులు సుందరీకరణలో భాగం గా రూ.2.3 కోట్లతో ప్రధాన కట్టను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వస్తు న్న వరదతో మాసాబ్చెరువు నిండింది. దీంతో చెరువు అందాలను తిలకించేందుకు మండలానికి చెందిన వారితోపాటు హైదరాబాద్ నగరానికి చెందిన వారు కూడా అధికంగా వస్తున్నారు. చెరువు వద్ద ఉన్న పార్కులో ఏర్పాటు చేసిన బుద్ధుడి విగ్రహం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఇక్కడికి వచ్చిన వారు ఆ విగ్రహం వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.
పూడిక తొలగింపు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా తుర్కయాంజాల్ లోని మాసాబ్చెరువును సుందరీకరించారు. చెరువు కాల్వను తవ్వడంతోపాటు పూడికను తొలగించారు. దీంతో చెరువులోకి భారీగా వరద నీరు రావడంతో నిండుకుండలా మారి జలకళను సంతరించుకున్న ది. చెరువులోకి మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకుంటే భవిష్యత్లో పర్యాటక ప్రాం తంగా అభివృద్ధి చెందుతుందని పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక చొరవతోనే చెరువుకట్ట అద్భుతంగా మారిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాలి
మాసాబ్ చెరువులోకి మురుగు నీరు చేరకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక చొరవతోనే మాసాబ్ చెరువు సుందరంగా అభివృద్ధి చెందింది. చెరువులోకి మురుగునీరు చేరకుంటే భవిష్యత్తులో పర్యాటక ప్రాంతంగా మారుతుంది. –సుదర్శన్రెడ్డి, మాజీ వార్డు సభ్యుడు