ఇబ్రహీంపట్నంరూరల్, జులై 6 : 15వ ఆర్థిక సంఘం నిధులు డ్రా చేసేందుకు ప్రభుత్వం సర్పంచ్లు, ఉపసర్పంచ్లకు అందజేస్తున్న డిజిటల్ కీని వినియోగించాలని జిల్లా పంచాయతీరాజ్ అధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్, మాడ్గుల మండలాలకు చెందిన సర్పంచ్లు, ఉపసర్పంచ్ల డిజిటల్ సంతకాల సేకరణ ప్రక్రియ కార్యక్రమాన్ని ఆయన ఎంపీపీ కృపేశ్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీపీవో శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నంలో 14, మంచాల మండలంలో 23, యాచారం మండలంలో 24, అబ్దుల్లాపూర్మెట్ మండలంలో 18, మాడ్గుల మండలంలో 32మంది సర్పంచ్లు, ఉపసర్పంచ్ల నుంచి సంతకాలు సేకరించి డిజిటల్ కీని అందించామన్నారు. ప్రభుత్వం నుంచి నేరుగా గ్రామపంచాయతీ ఖాతాల్లో జమయ్యే 15వ ప్రణాళిక నిధులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలుగకుండా గ్రామపంచాయతీల్లోని మౌలిక వసతుల కల్పనకు వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపారు.
ఈ నిధులను నేరుగా ఇకపై సర్పంచ్లు, ఉపసర్పంచ్లు డిజిటల్ కీని వినియోగించి ఈ నిధులను ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించినట్లు ఆయన తెలిపారు. డిజిటల్ కీ ఎలా వినియోగించాలనే దానిపై సర్పంచ్లు, ఉపసర్పంచ్లకు అవగాహన కల్పించారు. ఇబ్రహీంపట్నం ఎంపీవో లక్పతినాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీఎల్పీవో సంధ్యారాణి, ఎంపీడీవో క్రాంతికిరణ్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.