కొందుర్గు, జూలై 4 : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని, అధికారులు ప్రజలకు అందుబాటులో తప్పనిసరిగా ఉండాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం జిల్లెడు చౌదరిగూడ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీపీ యాదమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖల అధికారులు హాజరు కావడం లేదని సభ్యులు సభా దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల్లో ఇది వరకు ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు డబ్బులు రావడం లేదని తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి విడుదలవుతున్న నిధులు, పథకాలను అర్హులకు అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
జిల్లెడు చౌదరిగూడ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 71 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అందజేశారు. ప్రజల సంక్షే మం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు విజయ్కుమార్, జడ్పీటీసీ బంగారు స్వరూప, ఎంపీడీవో మహేశ్బాబు, ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 18 కోట్లు మంజూరు
షాద్నగర్ : షాద్నగర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు చూపిస్తానని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్లోని సాయిబాబాకాలనీలో నూతనంగా నిర్మించిన సీసీరోడ్డును ప్రారంభించి మాట్లాడారు. ఇటీవల టీఎఫ్ఐడీసీ ద్వారా మంజూరైన రూ. 18 కోట్లను మున్సిపాలిటీ అభివృద్ధికి వినియోగిస్తామని తెలిపారు. జానమ్మ చెరువు ఆధునీకరణతో పాటు పోచమ్మ దేవాలయం నుంచి ఫరూఖ్నగర్ ప్రధాన దారి గుండా భారీ అంతర్గత మురుగు కాల్వలను, వీధి దీపాల ఏర్పాటు, పలు కాలనీలలో సీసీరోడ్ల నిర్మాణాలకు నిధులను వెచ్చిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, మాజీ చైర్మన్ విశ్వం, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్ పులిమామిడి లతాశ్రీ, నాయకులు మన్నె నారాయణయాదవ్, చెట్ల నర్సింహ్మ, జూపల్లి శంకర్, మున్సిపల్ కమిషనర్ జయంత్కుమార్రెడ్డి, నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
చెక్కులు అందజేత
షాద్నగర్టౌన్ : ఫరూఖ్నగర్ మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త నర్సింలు ప్రమాదశాత్తు మృతి చెందాడు. నర్సింలు టీఆర్ఎస్ ప్రమాద బీమా సభ్యత్వం పొందడంతో బీమా పథకం ద్వారా మంజూరైన రూ. 2 లక్షల చెక్కును ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ మృతుడి భార్య చుక్కమ్మకు అందజేశారు. అదే విధంగా మున్సిపాలిటీలోని నెహ్రూనగర్కాలనీకి చెందిన రాణిబాయికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 40వేల చెక్కును ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కౌన్సిలర్ లతాశ్రీ పాల్గొన్నారు.