పరిగి, జూలై 4 : మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అమలుతో సర్కారు బడుల్లో విద్యార్థుల చేరిక పెద్దఎత్తున జరుగుతున్నది. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా నెల రోజుల్లో 17394 మంది విద్యార్థుల చేరికే ఇందుకు సాక్ష్యంగా చెప్పవచ్చు. ప్రైవేట్ బడుల నుంచి సైతం సర్కారు బడుల్లో వచ్చి చేరిన విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నది. వికారాబాద్ జిల్లాలోని పాఠశాలల్లో మొదటి విడుతలో మన ఊరు-మన బడి కింద 12 అంశాల్లో అభివృద్ది చేసేందుకు 371 పాఠశాలలను ఎంపిక చేయగా పనులు కొనసాగుతున్నాయి.
మరోవైపు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనకు శిక్షణ పూర్తిచేసి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అమలు చేస్తున్నారు. ఇందుకనుగుణంగా పాఠ్య పుస్తకాల్లో ఒక పేజీలో ఆంగ్లం, పక్క పేజీలో తెలుగులో పాఠ్యాంశాలు ఉండేలా ముద్రణ జరిగింది. దీంతో విద్యార్థులకు ఆంగ్ల విద్యాబోధన మరింత సులువుగా అర్థమయ్యేలా సర్కారు కృషి చేస్తున్నది. ఈ అంశాలపై గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించడంతోపాటు అంగన్వాడీ పాఠశాలలు, బడీడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేశారు. జూన్ ఒకటి నుంచి 30వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలోనూ ఇంటింటికీ వెళ్లి విద్యార్థులు సర్కారు బడుల్లో చేరేలా అవగాహన కల్పించారు.
జిల్లాలో 17,394 మంది విద్యార్థుల చేరిక
జిల్లావ్యాప్తంగా నెల రోజులపాటు నిర్వహించిన బడిబాట కార్యక్రమం ద్వారా 17,394 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఇందులో అంగన్వాడీల నుంచి ఒకటో తరగతిలో 2890, ప్రైవేట్ పాఠశాలల నుంచి ఒకటో తరగతిలో 1253, 2 నుంచి 12వ తరగతి వరకు 1381, ప్రాథమిక పాఠశాలల్లో 5వ తరగతి పూర్తయి 6వ తరగతిలో 10,139, 7వ తరగతి పూర్తయి 8వ తరగతిలో 1351, 9వ తరగతిలో 279, బడి బయట పిల్లలు 101 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. గతంలో ప్రాథమిక పాఠశాల స్థాయి వరకు తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని 6వ తరగతిలో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
ప్రాథమికోన్నత పాఠశాలలు 6, 7, 8వ తరగతి వరకు ఉన్నచోట సైతం ఇలాగే జరిగేది. తమ పిల్లలను సమీప పట్టణాల్లోని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించేవారు. కేవలం ఆంగ్ల మాధ్యమం కోసమే వారిని చేర్పించేవారు. ఈసారి ప్రతి గ్రామంలోనూ ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ఒక్కో విద్యార్థిని, వారి తల్లిదండ్రులను కలిసి మాట్లాడి ఈ సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభమవుతుందని, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు చక్కటి విద్యాబోధన అందిస్తారని తెలియజేశారు. దీంతో నెల రోజుల్లోనే పెద్దసంఖ్యలో సర్కారు బడుల్లో చేరారు. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. ్రప్రతి విద్యార్థికి ఉచితంగా అందించేందుకు 3,70,000 పాఠ్య పుస్తకాలు వికారాబాద్లోని బుక్ డిపోకు చేరుకున్నాయి. రెండు మూడు రోజుల్లో మిగతా పాఠ్య పుస్తకాలు రానుండడంతో వెనువెంటనే పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రారంభం కానుంది.
జిల్లాలో 17394 మంది విద్యార్థులు చేరిక – రేణుకాదేవి, జిల్లా విద్యా శాఖ అధికారి
బడి బాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 17394 మంది విద్యార్థులు చేరారు. ఇందులో అంగన్వాడీల నుంచి 2890, ప్రైవేట్ పాఠశాలల నుంచి 2634 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత తరగతుల్లో ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరారు. వారందరికీ త్వరలోనే ఉచిత పాఠ్య పుస్తకాలు అందజేయనున్నాం.
ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీల నుంచి 5524 మంది..
జిల్లా పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 5524 మంది విద్యార్థులు చేరారు. ఇందులో అంగన్వాడీల నుంచి ఒకటో తరగతిలో 2890, ప్రైవేట్ పాఠశాలల నుంచి ఒకటో తరగతిలో 1253, రెండో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రైవేట్ పాఠశాలల నుంచి 1381 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు.
మండలాలవారీగా చేరిన విద్యార్థులు
మండలం : విద్యార్థులు
బంట్వారం : 122
బషీరాబాద్ : 464
బొంరాస్పేట్ : 131
చౌడాపూర్ : 84
ధారూరు : 233
దోమ : 423
దౌల్తాబాద్ : 209
కొడంగల్ : 255
కోట్పల్లి : 86
కులకచర్ల : 211
మర్పల్లి : 375
మోమిన్పేట : 208
నవాబుపే ట : 199
పరిగి : 798
పెద్దేముల్ : 293
పూడూరు : 280
తాండూరు : 378
వికారాబాద్ : 488
యాలాల : 287