బొంరాస్పేట, జూలై 3 : పచ్చదనం పెంపే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన తెలంగాణకు హరితహారం మంచి ఫలితాలను ఇస్తున్నది. వర్షాకాలం ప్రారంభమైన తరువాత హరితహారాన్ని చేపట్టి పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. నాటిన మొక్కల సంరక్షణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. మొక్కలకు నీళ్లు పోయడానికి ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్ను మంజూరు చేసింది. వీటితో మొక్కలకు నీళ్లు పోయడంతో పాటు సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, పారిశుధ్య కార్మికులు మొక్కల సంరక్షణకు చొరవ తీసుకోవడంతో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం వెల్లివిరుస్తున్నది.
మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, రహదారులు హరితహారం స్ఫూర్తితో నేడు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. అధికారులు, ఉపాధ్యాయులు నాటిన మొక్కలు నేడు వృక్షాలై కార్యాలయాలకు కొత్త శోభనిస్తున్నాయి. 2015లో మండల కార్యాలయాల ఆవరణలో ఐదు వందల మొక్కలు నాటారు అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధులు. వేప, గుల్మొహర్, అల్లనేరేడు, బాదం, టేకు వంటి రకరకాల మొక్కలు ఇప్పుడు ఏపుగా పెరిగాయి. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడానికి బిందు సేద్యం పైపులను ఏర్పాటు చేసి మండల కార్యాలయాల ఆవరణలో ఉన్న బోరు నుంచి పైపులకు కనెక్షన్ ఇప్పించి రోజూ నీటిని అందించారు. మొక్కల మధ్య పెరిగిన గడ్డిని తరచూ తొలగిస్తూ వాటిని జాగ్రత్తగా పెంచారు. నాడు నాటిన మొక్కలే నేడు వృక్షాలై మండల కార్యాలయాలకు పచ్చని తోరణాల్లా మారాయి. ఐదేళ్ల కిందట మండల కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు బయట ఎండలోనే నిల్చుండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. హరితహారం పుణ్యమా అని చెట్లు పెరిగి నీడనిస్తున్నాయి.
కార్యాలయాల్లో…
ఒక్క మండల కార్యాలయాల ఆవరణలోనే కాకుండా హరితహారం స్ఫూర్తితో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్స్టేషన్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలల్లో విరివిగా మొక్కలు నాటించారు. ఆయా కార్యాలయాల అధికారులు వాటి రక్షణ బాధ్యత తీసుకుని పోషించడంతో నాటి మొక్కలే.. నేడు వృక్షాలై పచ్చదనం పరుచుకున్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు ఆవరణలో పెరిగిన చెట్లు చల్లటి వాతావరణాన్ని, నీడను, ఆహ్లాదమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి.
మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు పచ్చని చెట్లతో కళకళలాడుతూ వచ్చిపోయే వారికి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మండలంలోని మెట్లకుంటలో గత ఏడాది హరితహారం సందర్భంగా రోడ్డు పక్కన నాటిన మొక్కలు ఏపుగా పెరిగి రహదారికి కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి. దుద్యాల గ్రామంలోని పశువైద్య ఉప కేంద్రంలో ఉద్యోగి చొరవతో, ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయుల చొరవతో గత ఏడాది నాటిన మొక్కలు పెద్దగా పెరిగాయి. హరితహారంలో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ చిత్రాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.