ఆదిబట్ల, జూలై 2 : కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నూతన భవన సముదాయాన్ని ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఔటర్ రింగురోడ్డు కొంగరకలాన్ గ్రామంలో 42 ఎకరాల విస్తీర్ణంలో రూ.50కోట్లతో నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే భవన నిర్మాణం పనులు పూర్తి చేసింది.
అధునాతన సౌకర్యాలు..
ఉమ్మడి ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ భవనాల నిర్మాణంలో నాణ్యత లేకుండా కేవలం కాంట్రాక్టర్లు తమ లాభం కోసమే పనిచేసేది. ప్రభుత్వ భవనాల నిర్మాణంలో పూర్తిగా నాణ్యతలోపించేది. కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం హయాంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన నూతన కలెక్టరేట్ భవనం పనులు అధునాతన సౌకర్యాలు, నాణ్యతా ప్రమాణాలతో కూడుకొని ఉన్నది. ఇప్పటికే కార్యాలయం చుట్టూ ప్రహరీ, రోడ్లు, విద్యుత్, నీటిసరఫరా కూడా ఏర్పాటు చేశారు. కార్యాలయం చుట్టూ 30వేలకు పైగా మొక్కలను నాటారు. దీంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. నూతన కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ ప్రత్యేకంగా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.
30 శాఖల కార్యాలయాలు నిర్మాణం
జిల్లా యంత్రాంగం మొత్తం అక్కడి నుంచే పనిచేయడానికి అన్ని శాఖల కార్యాలయాలను అక్కడే నిర్మించారు. అక్కడి నుంచి 30 ప్రభుత్వ శాఖల పనులు చేయటానికి కార్యాలయాలు సిద్ధం చేశారు. ముఖ్యంగా రెవెన్యూ, వ్యవసాయం, విద్య, పౌరసంబంధాలు, ఇరిగేషన్, సాంఘిక సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖలతో పాటు మరిన్ని శాఖలు అక్కడి నుంచే పనిచేయనున్నాయి. కలెక్టరేట్ నూతన కార్యాలయం ఔటర్ రింగురోడ్డుకు సమీపంలో ఉండటంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు రవాణా సౌకర్యం సులభతరం కానున్నది. దీంతో ఈ ప్రాంతంలో నూతన కలెక్టరేట్ భవనం నిర్మించడంతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.
త్వరలో అందుబాటులోకి తెస్తాం..
నూతన కలెక్టరేట్ భవనం కావాలని ముఖ్యమంత్రిని కోరగానే వెంటనే మంజూరు చేశారు. కొత్త కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అన్ని పనులు పూర్తిచేశారు. ఎలాంటి సమస్యలు లేకుండా నిర్మాణం చేపట్టారు. త్వరలోనే కలెక్టరేట్ను భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి