రంగారెడ్డి, జూన్ 10, (నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రతి సోమవారం పల్లెనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వెనుకబడిన గ్రామాలను అభివృద్ధిలోకి తీసుకురావడంతోపాటు ప్రజా సమస్యలను స్థానికంగానే పరిష్కరించేందుకు జూన్ 6వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గమైన మహేశ్వరంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి సోమవారం ఉదయం గ్రామాల్లో అధికారులతో కలిసి పర్యటించి ప్రజా సమస్యలను పరిష్కరించనున్నారు. అదేవిధంగా ప్రతి సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు నియోజకవర్గంలోని ఒక గ్రామంలో పర్యటించి అక్కడే మంత్రి పల్లెనిద్ర చేయనున్నారు. వెనుకబడిన గ్రామాలను కూడా అన్ని గ్రామాలతో సమానంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మం త్రి సబితారెడ్డి తెలిపారు.
పల్లె నిద్రలో భాగంగా ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలతోపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతీరును స్వయంగా స్థానికులను అడిగి తెలుసుకోవడంతోపాటు పల్లెప్రగతి పనులను కూడా సమీక్షించి, ఎక్కడైనా వెనుకబడితే అందుకు గల కారణాలను తెలుసుకొని వెంటనే పరిష్కారం చూపనున్నారు. పల్లెనిద్రలో భాగంగా సమస్యల పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు, ప్రజలతో చర్చించనున్నారు. ఇప్పటికే కందుకూరు మండలంలోని దావూద్ఖాన్గూడ గ్రామం లో పల్లెనిద్ర కార్యక్రమం పూర్తికాగా, వచ్చే సోమవారం ముచ్చర్లలో పల్లెనిద్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా..
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టా. పల్లెలు, పట్టణాలు అభివృద్ధిలో ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఆ గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించడంతోపాటు… రాత్రి సమయంలో అక్కడ ‘పల్లెనిద్ర’ చేసి స్థానికుల సలహాలు.. సూచనలతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నా.
– పి.సబితాఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి