యాచారం, మే 28: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు మెరుగైన వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆరోగ్యశాఖ కమిషనర్ అజయ్కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సూచనల మేరకు శనివారం ఆయన సందర్శించి పరిశీలించారు. దవాఖాన భవనాన్ని, అందులోని వసతులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన వైద్యులతో మాట్లాడి దవాఖాన పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు.
యాచారం పీహెచ్సీని 30 పడకల దవాఖానగా మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, దీంతో దవాఖాన రూపురేఖలు పూర్తిగా మారిపోతాయన్నారు. ఇకపై దవాఖానలో 24 గంటలపాటు వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. వైద్యసేవలను మరింతగా విస్తరించేందుకు పీహెచ్సీలను గ్రామాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మొండిగౌరెల్లి సర్పంచ్ కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు యాదగిరి, మారోజు శ్రీనివాస్, మహ్మద్ ఖాజా, ఐవీఎస్ రెడ్డి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు కల్పిస్తాం
కడ్తాల్, మే 28: రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందిస్తామని రాష్ట్ర ఆరోగ్యశాఖ కమిషనర్ అజయ్కుమార్ అన్నారు. శనివారం ఆయన ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ దవాఖానను సందర్శించి పలు రికార్డులు, భవనాలు, మందుల స్టాక్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని 61 పీహెచ్సీలను కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేశామన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అన్ని రకాల వసతులను కల్పిస్తామన్నారు.
రెండు రోజుల క్రితం నిర్వహించిన ఆరోగ్య సమీక్షలో జిల్లాల్లో పీహెచ్సీ స్థాయి నుంచి సీహెచ్సీగా మారిన దవాఖానల్లో ఉన్న వసతులపై చేపట్టాల్సిన పనులు, కల్పించాల్సిన వసతులపై పూర్తి స్థాయి నివేదికలు అందజేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లోని సీహెచ్సీల పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు కమిషనర్ దవాఖానలోని వసతులు, వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఉద్యోగాలను భర్తీ చేయాలని వినతి
ఆమనగల్లు పట్టణంలోని సీహెచ్సీలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయడంతోపాటు, నూతన భవనం, మౌలిక వసతులను కల్పించాలని కోరుతూ కమిషనర్ అజయ్కుమాకు జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పత్యానాయక్ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఖలీల్, రమేశ్నాయక్, గణేశ్నాయక్, యాదగిరి, వెంకటేశ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.