మొయినాబాద్, మే 25 : రాష్ట్ర ప్రభుత్వం పల్ల్లె వాతావరణం పచ్చందాలతో పరిఢవిల్లాలనే సంకల్పంతో ప్రతి గ్రామపంచాయతీలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. మండల పరిధిలోని కాశీంబౌలి ఇటీవల గ్రామపంచాయతీగా ఏర్పాటైంది. దీనికి అనుబంధ గ్రామమైన నజీబ్నగర్లో ఎకరా ప్రభుత్వ భూమిలో సర్పంచ్ మహేందర్రెడ్డి పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దీంతో పల్లె ప్రకృతి వనం దట్టమైన అడవిని తలపిస్తున్నది. బుధవారం కలెక్టర్ అమయ్కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్, డీఆర్డీవో ప్రభాకర్లతో కలిసి కాశీంబౌలి అనుబంధ గ్రామం నజీబ్నగర్లోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు.
పల్లె ప్రకృతి వనమంతా తిరిగి చాలా బాగుందని ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం ముర్తుజాగూడ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న క్రీడా మైదానం స్థలాన్ని పరిశీలించారు. జూన్ 2 వరకు మైదానాన్ని పూర్తి చేయాలని మండలస్థాయి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ నక్షత్రం, డీఎల్పీవో శ్రీకాంత్రెడ్డి, ఎంపీడీవో సంధ్య, ఎంపీవో వెంకటేశ్వర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి లావణ్య, నాయకులు పెంటారెడ్డి, మహేశ్యాదవ్ ఉన్నారు.
డబ్బాలు తొలగించకపోతే సస్పెండ్ చేస్తా..
ప్రభుత్వ భూమిలో అక్రమంగా డబ్బాలు వేయడంతోపాటు రోడ్డును కూడా ఆక్రమించిన డబ్బాలను తొలగించకపోతే సస్పెండ్ చేస్తానని పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ హెచ్చరించారు. రెండు మూడు రోజుల్లో డబ్బాలు తొలగించకపోతే చర్యలు తప్పవన్నారు. ఇంత జరిగినా అధికారులు చోద్యం చూస్తున్నారా అని మండిపడ్డారు. డబ్బాలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని డివిజనల్ పంచాయతీ అధికారులను ఆదేశించారు.