పరిగి, మే 21 : పట్టణాల్లో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు ఒకే దగ్గర ప్రజలకు అందుబాటులో ఉంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా సమీకృత మార్కెట్లను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు పనులను వేగవంతం చేసింది. రాబోయే నాలుగున్నర నెలల్లో సమీకృత మార్కెట్లు నిర్మాణం పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలోని వికారాబాద్లో రూ.4.5 కోట్లు, తాండూరులో రూ.4.5కోట్లు, పరిగిలో రూ.2కోట్లు, కొడంగల్లో రూ.2కోట్లు వెచ్చించి సమీకృత మార్కెట్లు నిర్మాణం చేపడుతున్నది. ఇందుకు సంబంధించి నిధులు మంజూరై టెండర్లు సైతం పూర్తయ్యాయి. అంతేకాకుండా పనులు వెంటనే ప్రారంభమయ్యేలా చూడాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు కలెక్టర్ నిఖిల ఆదేశించారు. సెప్టెంబర్ నెలాఖరు లోపు సమీకృత మార్కెట్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా ఈ మార్కెట్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
రెండు ఎకరాల్లో..
వికారాబాద్ జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ పట్టణాల్లో రెండు ఎకరాల విస్తీర్ణంలో సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా వెజ్, నాన్వెజ్ స్టాళ్లు వేర్వేరుగా ఉండే విధంగా రెండు సముదాయాలను నిర్మించనున్నారు. తాండూరు, వికారాబాద్లలో నిర్మాణం చేపట్టే సమీకృత మార్కెట్లలో మొత్తం 108 స్టాళ్లు ఉండనుండగా.. పరిగి, కొడంగల్లో 48 స్టాళ్లు నిర్మించనున్నారు. ఇందులో కూరగాయలు, పూలు, పండ్లు, నాన్వెజ్ల కోసం ప్రత్యేక స్టాళ్లు నిర్మిస్తారు. అలాగే నాన్ వెజ్ మార్కెట్లో కోల్డ్ స్టోరేజ్ సైతం ఏర్పాటు చేయనున్నారు. వినియోగదారులు అన్ని దుకాణాల్లో కూరగాయలు, పూలు, పండ్లు, నాన్వెజ్ పరిశీలించి కొనుగోలు చేసేందుకు వీలుగా స్టాళ్ల మధ్య కారిడార్ల నిర్మించనున్నారు. భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు వీలుగా ఈ మార్కెట్ల నిర్మాణం చేపట్టనున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విస్తరించడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు మార్కెట్కు వచ్చే వారి వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్కు స్థలాలు కేటాయించారు. తద్వారా అన్ని హంగులతో సమీకృత మార్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇదిలావుండగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో సైతం సమీకృత మార్కెట్లను మార్కెట్ కమిటీల స్థలాల్లో నిర్మించనుండడంతో స్థలాల కేటాయింపునకు సంబంధించి మార్కెటింగ్ శాఖ జీవో జారీ చేసింది.
అన్నీ ఒకే దగ్గర …
మున్సిపాలిటీల్లో సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణంతో ప్రజలకు అన్నీ ఒకే దగ్గర అందుబాటులో ఉండనున్నాయి. సాధారణంగా కూరగాయలు ఒక దగ్గర, నాన్వెజ్ మరో దగ్గర, పూలు, పండ్లు ఇతర చోట్ల విక్రయిస్తుంటారు. సమీకృత మార్కెట్ల నిర్మాణం పూర్తయితే ఒకే దగ్గర అన్ని రకాల కూరగాయలు, నాన్వెజ్, పూలు, పండ్లు అందుబాటులోకి వస్తాయి. తద్వారా నచ్చినవి కొనుగోలు చేసేందుకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఎవరికి కావాల్సినవి వారు కొనుగోలు చేసేందుకు ఈ సమీకృత మార్కెట్లు ఉపయోగకరంగా ఉండనున్నాయి. మరోవైపు వారాంతపు సంతలు కాకుండా ప్రతిరోజు కూరగాయలు, పూలు, పండ్లు, నాన్ వెజ్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా చిన్న పట్టణాల్లో వారాంతపు సంతలలోనే కూరగాయలు లభిస్తుంటాయి. సమీకృత మార్కెట్ల నిర్మాణంతో ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.
సెప్టెంబర్లోపు పనుల పూర్తికి చర్యలు..
జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీల్లో సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణానికి చర్యలను వేగవంతం చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. ఇప్పటికే టెండర్లు పూర్తవడంతోపాటు మార్కెటింగ్ శాఖ ద్వారా సమీకృత మార్కెట్ల కోసం స్థలాల కేటాయింపునకు సంబంధించిన జీవోను సైతం ప్రభుత్వం జారీ చేసిందన్నారు. సమీకృత మార్కెట్ల నిర్మాణం సాధ్యమైనంత త్వరగా ప్రారంభించడంతోపాటు సెప్టెంబర్ నెలాఖరు వరకు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.