రంగారెడ్డి జిల్లా పల్లెలు ‘ప్రగతి’ కాంతులీనుతున్నాయి. ఏ గ్రామానికెళ్లినా పరిశుభ్ర వాతావరణం, పచ్చని చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాకు పల్లె ప్రగతి కింద రూ.104కోట్లు విడుదల కాగా పలు అభివృద్ధి పనులను చేపట్టారు. జిల్లాలో మొత్తం 558 గ్రామ పంచాయతీలుండగా.. నెలకు రూ.4కోట్ల చొప్పున ప్రభుత్వం నిధులు అందిస్తున్నది. వీటితో ఊరికో ప్రకృతి వనం, డంపింగ్యార్డు, వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్డు వంటి వసతులు కల్పించడంతో ప్రజల కష్టాలు తీరాయి. ట్రాక్టర్ కొనుగోలు చేసి మొక్కలకు నీటి సరఫరా, ఇంటింటికెళ్లి చెత్త సేకరిస్తుండడంతో పల్లెలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. అంతేకాకుండా ప్రతి వీధికి అండర్గ్రౌండ్ డ్రైనేజీ, సీసీరోడ్డు నిర్మించడంతో మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.
రంగారెడ్డి, మే 16 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంతో జిల్లాలోని అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్నాయి. ప్రతినెలా ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులతో అన్ని గ్రామాల్లో మౌలిక వసతులతోపాటు అన్ని రకాల అభివృద్ధి పనులను సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు చేపడుతున్నారు. దీంతో గతంలో ఎన్నడూలేని విధంగా పల్లెలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా రోడ్లకు ఇరువైపులా మొక్కలు పెరిగి హరితశోభను సంతరించుకున్నాయి. మరోవైపు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య సిబ్బంది ప్రతిరోజూ రోడ్లను శుభ్రం చేస్తూ.. చెత్తాచెదారాన్ని ప్రభుత్వ ట్రాక్టర్ సహాయంతో డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు.
అక్కడ తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. అన్ని గ్రామాల్లోనూ వైకుంఠధామాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా అన్ని గ్రామాల్లోనూ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలను అందులో పెంచుతున్నారు. దీంతో అక్కడ పచ్చదనంతోపాటు ఆహ్లాదకర వాతావరణం నెలకొని అక్కడికి వచ్చే సందర్శకులను ఆకట్టుకుంటున్నది. పల్లెప్రగతిలో పెంట కుప్పలు, భవన శిథిలాల తొలగింపు, ప్రభుత్వ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలను శుభ్రం చేయడం, గ్రామాల్లో సర్కారు తుమ్మ, జిల్లెడు వంటి పిచ్చి మొక్కలను తొలగించడం వంటి పలు కార్యక్రమాలను చేపట్టడంతో గ్రామాల్లో గత రెండేండ్లుగా సీజనల్ వ్యాధు లు ప్రబలకపోవడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలోని 558 గ్రామ పంచాయతీలకు ప్రతినెలా ప్రభుత్వం సుమారు రూ.4 కోట్ల చొప్పున నిధులను విడుదల చేస్తున్నది.
ఇప్పటివరకు జిల్లాకు రూ.104 కోట్లు నిధులు..
పల్లెప్రగతిలో భాగంగా జిల్లాకు ప్రభుత్వం నుంచి భారీగా నిధులు మంజూరయ్యాయి. రెండేండ్ల కాలంలో ఇప్పటివరకు రూ.104 కోట్ల నిధులు జిల్లాకు విడుదలయ్యాయి. పల్లెప్రగతి ప్రారంభమైన నాటి నుంచి ప్రతినెలా ప్రభుత్వం రూ.4 కోట్ల చొప్పున నిధులను కేటాయిస్తున్నది. పల్లెప్రగతిలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మురుగునీరు రోడ్లపై పారకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించి, అందుబాటులోకి తీసుకొచ్చారు. మట్టి రోడ్ల స్థానంలో సీసీ రోడ్లను నిర్మించారు. గ్రామాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన మరమ్మతుల పూర్తి, కరెంట్ చార్జీలు, ట్రాక్టర్ల లోన్ చెల్లింపులు, పారిశుధ్య పనులకు పల్లెప్రగతి కింద అధిక నిధులను వినియోగించారు. అదేవిధంగా గ్రామాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన వా తావరణాన్ని అందించేందుకు జిల్లాలోని 558 గ్రామ పంచాయతీలతోపాటు 307 హాబిటేషన్లలో పల్లెప్రకృతివనాలను ఏర్పాటు చేశారు.
ప్రతి గ్రామంలో 40 గుంటల్లో నాలుగు వేల మొక్కలతో పల్లె ప్రకృతివనాలను ఏర్పాటు చేసి అందులో మొక్కలు, వాకింగ్ ట్రాక్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.9 లక్షల చొప్పున ఖర్చు చేసింది. ప్రతి గ్రామ పంచాయతీకి కేటాయించిన పదిశాతం గ్రీన్ బడ్జెట్ నుంచి ప్రకృతి వనాలకు నిధులను ఖర్చు చేశారు. అంతేకాకుండా మండలానికి ఒక బృహత్ పల్లెప్రకృతి వనం పేరిట చిట్టడవులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రతి గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్లు, ట్రాలీ, ట్యాంకర్లను అందజేసింది. ఈ ట్రాక్టర్లతో గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరుగా సేకరించడంతోపాటు ప్రతిరోజూ గ్రామాల్లోని చెత్తను డంపింగ్ యార్డులకు తరలించడం, గ్రామాల్లోని పల్లెప్రకృతివనాల్లో నాటే మొక్కలకు నీటిని అందించడంతోపాటు వివిధ రకాల పనులకు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. ట్రాక్టర్ల లోన్ డబ్బులను కూడా పల్లెప్రగతి నిధుల నుంచే ప్రతినెలా చెల్లిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లోనూ కంపోస్ట్ షెడ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కో షెడ్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.6 లక్షల చొప్పున ఖర్చు చేయగా.. కంపోస్ట్ షెడ్లో తడి-పొడి చెత్తను వేరు చేసి ఎరువును తయారు చేస్తున్నారు.
గ్రామాల అభివృద్ధికి ప్రతినెలా నిధులు
పల్లెప్రగతి కార్యక్రమంతో జిల్లాలోని అన్ని గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. పల్లెప్రగతి కింద ప్రభుత్వం ప్రతినెలా రూ.4 కోట్ల చొప్పున నిధులను జిల్లాకు విడుదల చేస్తున్నది. ప్రతినెలా ప్రభుత్వం నుంచి అందుతున్న నిధులతో గ్రామాల్లో మౌలిక వసతులతోపాటు అన్ని రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పల్లెప్రకృతి వనాలు, అన్ని గ్రా మాల్లో మొక్కలు నాటడంతో గ్రామాలు హరితవనంలా కనిపిస్తున్నాయి.
– శ్రీనివాస్రెడ్డి, డీపీవో రంగారెడ్డి జిల్లా