ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 17 : రాష్ట్రాన్ని హరితవనంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా వర్షాలు సమృద్ధిగా కురిసిన వెంటనే మొక్కలను నాటేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో హరితవనం నర్సరీల్లో మొక్కలను సిద్ధంగా ఉంచారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అటవీశాఖ ఆధ్వర్యంలో 15 నర్సరీల్లో 30లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. నియోజకవర్గంలోని ఎలిమినేడు, కర్ణంగూడ, దండుమైలారం, పోల్కంపల్లి, నాగన్పల్లి, మంచాల, చిత్తాపూర్, జాపాల, రంగాపూర్, నోముల, ఎల్లమ్మతండా, ఆగాపల్లి, గున్గల్, గడ్డమల్లయ్యగూడ, అనాజ్పూర్ గ్రామాల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. రాష్ట్రంలో దట్టమైన అడవులను పెంచే విధంగా అటవీ ప్రాంతాల్లో వివిధ రకాల మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను అటవీశాఖ అధికారులకు ప్రభుత్వం ఇచ్చింది. దీంతో డివిజన్లో ఏడు విడుతల్లో సుమారు ముప్పైలక్షల మొక్కలను అటవీశాఖ ఆధ్వర్యంలో నాటి వాటికి క్రమం తప్పకుండా నీటిని అందిస్తూ సంరక్షిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది ఎనిమిదో విడుత హరితహారంలో భాగంగా 30లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా అటవీశాఖ అధికారులు కృషిచేస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసిన వెంటనే అటవీప్రాంతాల్లో మొక్కలను నాటేందుకు ఖాళీ స్థలాలను ఎంచుకుని సిద్ధంగా ఉంచారు. ఇబ్రహీంపట్నం డివిజన్లో అధికశాతం మొక్కలు నాటాలన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆదేశాలతో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నర్సరీల్లో వేప, కానుగ, నేరేడు, రావి, మర్రి, మద్ది, చింత, చీమచింత, బూరుగ, బహున్య, ఉసిరి, సీతాఫలం, రేల, ఏగిస, ఎర్రచందనం, రోజ్హుడ్, జమ్మి, మారెడు, వెదురు, కచ్చకాయలతో పాటు వివిధ రకాల మొక్కలను సిద్ధంగా ఉంచారు.
పెద్ద ఎత్తున మొక్కలు నాటుతాం
అటవీశాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో 15నర్సరీల్లో 30లక్షల మొక్కలను అందుబాటులో ఉంచాం. ఈ మొక్కలను వర్షాలు పడిన వెంటనే సిబ్బంది ద్వారా గోతులను తీయించి అటవీప్రాంతాల్లో నాటనున్నాం. గత హరితహారంలో నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీటిని అందిస్తూ కాపాడుతున్నాం.
– భానూరి శ్రీనివాస్రెడ్డి, అటవీశాఖ టెక్నికల్ అసిస్టెంట్