ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 2 : ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో శనివారం ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. శుభకృత్నామ సంవత్సరానికి స్వాగతం పలికారు. మామిడి, వేప, పులుపు, వగరు, తీపి వంటి పదార్థాలతో ఉగాది పచ్చడని తయారుచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ గ్రామాల్లోని ఆలయాల్లో పురోహితులు పంచాంగ చదివి వినిపించారు. ఈ ఏడాది మొత్తం వర్షాలు, పంటలు, ఆదాయం, వ్యయం వంటి పలు విషయాలపైన పురోహితులు ప్రజలకు వివరించారు. గ్రామా ల్లో కొత్తగా వ్యవసాయ పనులను కూడా పండుగరోజున ప్రారంభించారు. ఉగాది పండుగ సందర్భంగా గ్రామాల్లో సందడి నెలకొంది. మంచాల, యాచా రం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఆదిబట్ల, తుర్కయంజాల్, పెద్దఅంబర్పేట్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో ప్రజలు పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఉగాది పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకొన్నారు. వివిధ గ్రామాల నుంచి పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలు సంతోషంగా ఉండాలి
కేశంపేట : శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ దేవుడిని వేడుకున్నారు. కేశంపేట మండలంలోని ఎమ్మెల్యే స్వగ్రామమైన ఎక్లాస్ఖాన్పేట శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం పండితులు రాశీ ఫలాలపై చెప్పిన పంచాంగం విన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్యాదవ్, షాద్నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి పాల్గొన్నారు.
మైసమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
కడ్తాల్ : మైసిగండి గ్రామంలో కొలువైన మైసమ్మతల్లి ఆలయంలో ఉగాది పండుగను పురస్కరించుకొని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు ఉగాది పచ్చడిని అందజేశారు. మండల వ్యాప్తంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ శిరోలీ, ఈవో స్నేహలత, టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, తులసీరాంనాయక్, బీసీ సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు వెంకటేశ్ పాల్గొన్నారు.
హనుమాన్ ఆలయంలో పచ్చడి పంపిణీ
తలకొండపల్లి : మండల కేంద్రంలోని దేవాలయంలో జైశ్రీరాం యూత్ ఆధ్వర్యంలో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడులకను జరుపుకొన్నారు. దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణవాసులకు పచ్చడి వితరణ చేశారు. కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ సుధాకర్రెడ్డి, రాంపూర్ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీశైలంయాదవ్, రవి, శ్రీకాంత్యాదవ్, కుమార్ పాల్గొన్నారు.
షాద్నగర్టౌన్ : ప్లవనామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ శుభకృత్ నామ సంవత్సరానికి స్వాగతం పలికారు. తెల్లవారు జాము నుంచే పట్టణవాసులు తమ నివాసాలను పరిశుభ్రం చేసుకుని మామిడి, వేప కొమ్మలతో ప్రత్యేకంగా అలంకరించుకున్నారు. దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
షాబాద్ : షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లోని ఆయా గ్రామాల్లోని హనుమాన్ దేవాలయాల్లో వేదపండితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు రాశిశీ ఫలాలు చదివి వినిపించారు.
ఆమనగల్లు: ప్రగతిభవన్లో జనహిత ప్రాంగణంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పర్వదిన వేడుకల్లో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో వేడుకలను నిర్వహించారు. మండలంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అయ్యసాగర్ క్షేత్రంలోని వీరభద్ర ఆలయం, సాయిబాబా, ఆంజనేయ స్వామి ఆలయాల వద్ద భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఆలయాల్లో పలువురు అర్చకులు పంచాంగ శ్రవణం నిర్వహించారు.
కొందుర్గు : కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలంలోని ఆయా గ్రామాల్లో పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఇండ్ల ముందు ముగ్గులు వేశారు. దేవాల యాల వద్ద భజనలు చేసి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
కొత్తూరు : మున్సిపాలిటీ పరిధిలోని మారుతి హనుమాన్ ఆలయంలో పంచాంగ పఠనం చేశారు. ఆదాయ వ్యయాలు, అవమానం, రాజపూజ్యం తదితరాలను వివరించారు. కార్యక్రమంలో దేవేందర్యాదవ్, సుదర్శన్గౌడ్, యాదయ్య, నాగరాజుచారి, ప్రజలు పాల్గొన్నారు.