ఇబ్రహీంపట్నం రూరల్, డిసెంబర్ 10: రంగారెడ్డి జిల్లాలో ఇంటి పన్నుల వసూళ్ల ప్రక్రియ చకచకా సాగుతున్నది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 558 గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పన్నులను వసూలు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా వంద శాతం పన్నుల వసూళ్లను పూర్తి చేసేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 55 శాతం పన్నులు వసూలు చేసినట్లు జిల్లా పంచాయతీరాజ్ అధికారి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. పన్నుల వసూళ్లపై డీపీవో నిత్యం ఒక్కో మండలంలో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రూ. 26.83 కోట్లు టార్గెట్ ఉండగా, ఇప్పటి వరకు సుమారు రూ.15.25 కోట్ల వరకు వసూలైనట్లు తెలిపారు.
జీపీ ఖాతాల్లో పన్నులు జమ..
వసూలు చేసిన పన్నులను గ్రామపంచాయతీ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పన్నులను తిరిగి గ్రామాల్లో కార్మికుల వేతనాలు, వీధి దీపాల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ, నీటి ట్యాంకులను శుభ్రం చేయడం, రోడ్లను శుభ్రం చేయడం, పంచాయతీ ట్రాక్టర్లు, ఆటోల నిర్వహణ వంటివాటికి వెచ్చించనున్నారు. ఇంటి పన్నుల వసూళ్లు, వాటిని ఎలా సద్వినియోగం చేసుకుంటామో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ నెలాఖరులోగా పన్ను వసూళ్లను పూర్తి చేస్తాం..
రంగారెడ్డి జిల్లాలోని 558 గ్రామాల్లో ఈ నెలాఖరులోగా పన్నుల వసూళ్లను పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు వసూలైన డబ్బులను జీపీ ఖాతాల్లో జమ చేశాం. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.
– శ్రీనివాస్రెడ్డి, జిల్లా పంచాయతీరాజ్ అధికారి