వికారాబాద్, డిసెంబర్ 10 : పోడు భూముల లబ్ధిదారులకు హక్కు పత్రాలు జారీ చేసేందుకు సబ్ డివిజనల్ లెవల్ కమిటీలు అర్హుల వివరాలను మూడు రోజుల్లో అందజేస్తే, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు కలెక్టర్ నిఖిల తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సబ్ డివిజనల్ లెవల్ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఆర్వోఎఫ్ఆర్ 2005 చట్టం ప్రకారం అర్హులైన వారికి పోడు భూముల కేటాయింపు కోసం జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరుగుతుందన్నారు. ఆర్డీవోల అధ్యక్షతన నిర్వహిస్తున్న సబ్ డివిజనల్ లెవెల్ కమిటీలు సిఫారసు చేసిన లిస్టును సమావేశంలో జడ్పీటీసీలకు అందజేయాలన్నారు. కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి అర్హులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆర్వోఎఫ్ఆర్ 2005 చట్టం ప్రకారం డిసెంబర్ 2005 కంటే ముందు సేద్యం చేసుకుంటున్న వారు అర్హులన్నారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని జడ్పీటీసీలు కోరగా, ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారమే అర్హులను ఎంపిక చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజీ, కమిటీ సభ్యులు ధారూరు, కుల్కచర్ల, పెద్దేముల్, బషీరాబాద్, బొంరాస్పేట జడ్పీటీసీలు పాల్గొన్నారు.