పెద్దఅంబర్పేట, నవంబర్ 30 : పెండ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు.. వందేండ్ల జీవితానికి పునాదులు. అందుకే ఆ వందేండ్లు గుర్తుండిపోయేలా పెండ్లి వేడుకను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. యువత ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా వివాహ తంతును కొనసాగిస్తున్నారు తల్లిదండ్రులు. మళ్లీ తాతల రోజులు గుర్తుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మెహెందీతో మొదలు పెట్టి డిన్నర్ వరకు వినూత్నంగా నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఖర్చుకు వెనుకాడటం లేదు.
ఉత్సాహంగా హల్దీ..
హల్దీ.. ఇప్పుడు దాదాపు ప్రతి పెండ్లి ఇంట వినిపిస్తున్న పదం ఇది. వధువు తరఫు, వరుడు తరఫు అన్న తేడా లేకుండా రెండిండ్లలో పసుపు పండగను నిర్వహిస్తున్నారు. లగ్గానికి మూడ్రోజుల ముందు హల్దీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం దగ్గర బంధువులను, స్నేహితులను పిలిపించుకుంటున్నారు. ప్రత్యేకంగా పూలతో డెకరేషన్ చేయిస్తున్నారు. పచ్చని పూలతో ఆకట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు మొదలుకుని స్నేహితుల వరకు ఒక్కొక్కరు పసుపు నీటిని వధువుపై పోస్తూ ఆశీర్వదిస్తుంటారు. డీజేలు ఏర్పాటుచేసుకుని నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. హల్దీ సమయంలోనే డెకరేషన్కు రూ.8 వేల నుంచి 20 వరకు వెచ్చిస్తున్నారు.
మెహెందీ ముచ్చట్లు..
పెండ్లికి ఒక రోజు ముందు కుటుంబసభ్యులతోపాటు వచ్చిన బంధువులందరికీ మెహెందీ పెట్టించడం ఇప్పుడు తప్పనిసరైంది. మెహెందీని ఓ సంబురంగానే జరుపుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. సాయంత్రం మొదలు అర్ధరాత్రి వరకు సంతోషంగా గడుపుతున్నారు. సాధారణంగా బయట మార్కెట్లో ఒక్కరికి మోచేతి వరకు మెహెందీ పెట్టేందుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు చార్జి చేస్తుంటారు. వివాహ వేళ కుటుంబసభ్యులతోపాటు బంధుమిత్రులు చాలామంది వస్తారు. దీంతో మెహెందీ (మైదాకు) పెట్టేందుకు ప్రత్యేకంగా స్పెషలిస్ట్లను రప్పిస్తున్నారు. ఇందుకు ఒక్కరు రూ.10 వేల వరకు తీసుకుంటున్నారు.
సంగీత్తో ఆటాపాట..
పెండ్లి అనగానే సంగీత్ ఉన్నదా? అని అడగడం ఇప్పుడు ఓ అలవాటు అయిపోయింది. అందుకే పెండ్లి జరిపించేవారు ఎక్కడా తగ్గడం లేదు. ఖర్చు ఎక్కువయినా సరే కానీ, అన్ని కార్యక్రమాలను ఆర్భాటంగా నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారు. చిన్నపాటి డీజేలను ఏర్పాటు చేసుకుని స్నేహితులు, దగ్గరి బంధువులను పిలిపించుకుంటున్నారు.
థీం డ్రెస్సింగ్..
వధువు, వరుడు తరఫు దగ్గరి బంధువులు వివాహ వేడుకల్లో అందరినీ ఆకట్టుకునేందుకు ఓ థీంతో రెడీ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందరూ ఒకే మాదిరి డ్రెస్సింగ్తో సిద్ధమవుతున్నారు. షేర్వానీలను కుట్టిస్తున్నారు. ఇంకొందరు పెండ్లి వేడుకలకు వచ్చే వారికి పగిడీలు పెట్టించడం ట్రెండ్గా మారింది.
ఫంక్షన్ హాళ్లకు భలే గిరాకీ..
నగర శివారులో భారీ స్థాయిలో ఫంక్షన్ హాళ్లు ఏర్పాటయ్యాయి. ఒక్కో ఫంక్షన్ హాల్ ధర రూ.50 వేలు మొదలుకొని దాదాపు రూ.5 లక్షల వరకు ఉంటున్నది. అందుకు తగ్గట్టే పార్కింగ్, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇందులో ఏసీ, నాన్ఏసీ సౌకర్యాలు సైతం ఉన్నాయి. వచ్చేనెల 2వ తేదీ నుంచి పెద్ద ఎత్తున వివాహాలు ఉండటంతో చాలావరకు రెండు నెలల ముందుగానే బుక్కయ్యాయని ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు చెబుతున్నారు.
అన్నీ కెమెరాల్లో బందీ..
పెండ్లి వేడుకలోని ప్రతి సందర్భాన్ని తీపి జ్ఞాపకాలుగా పదిల పర్చేందుకు ఎంత ఖర్చుకయినా వెనుకాడటంలేదు. సాధారణంగా పెండ్లి వేడుకకు ఒక ఫొటోగ్రాఫర్, ఓ వీడియోగ్రాఫర్ వస్తే రూ.70 వేల నుంచి 90 వేల వరకు తీసుకుంటున్నారు. ఇక ఎంగేజ్మెంట్తో కలిపితే మరో రేటు ఉంటుంది. మధ్య తరగతి కుటుంబాలే ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ షూట్, పెండ్లి, డిన్నర్ కలిపి రూ.2.5 లక్షల నుంచి దాదాపు 5 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ఆర్థికంగా ఉన్నతస్థాయి కుటుంబాలు రూ.25 లక్షల వరకు ఫొటోగ్రఫీ కోసమే వెచ్చిస్తున్నాయి.
క్యాటరింగ్దే హవా..
చిన్న దావత్ నుంచి పెండ్లి వరకు ప్రతి ఒక్కరు క్యాటరింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. క్యాటరింగ్కు ఇచ్చేస్తే చాలు.. నీళ్ల నుంచి ప్లేట్ల వరకు, వైట్ రైస్ నుంచి బిర్యానీ దాకా, స్వీట్ల నుంచి ఐస్క్రీంల వరకు అన్నీ వాళ్లే తీసుకొస్తున్నారు. తినే ప్లేట్లు, వాటిని పడేసేందుకు డస్ట్బీన్ కవర్లు ఇలా అన్నీ ఒక్క ఆర్డర్లోనే వచ్చేస్తున్నాయి. దీంతో ఏ కష్టం లేకుండా, ఏ ఇబ్బంది రాకుండా క్యాటరింగ్కు ఇచ్చేస్తున్నారు. శాకాహారానికి ఒక్కో ప్లేట్కు వెరైటీలను బట్టి రూ.250 నుంచి 500 వరకు ఉంటుండగా.. మాంసాహారానికి రూ.350 మొదలు రూ.600 వరకు ఉంటున్నాయి. అయినప్పటికీ ‘పెండ్లి మళ్లీ మళ్లీ చేసేది ఉందా..’ అంటూ ఎంత ఖర్చుకయినా వెనుకాడటంలేదు.
కష్టంగా పురోహితుల లభ్యత..
మార్గశిర మాసంలో డిసెంబర్ 2 నుంచి మొదలుకొని 18 వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. కార్తీక, శ్రావణ మాసాల్లో శుభ ముహూర్తాలు లేవు. అందుకే ప్రస్తుతం చాలామంది శుభకార్యాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. గృహ ప్రవేశాలు, పెండ్లిళ్లు ఎక్కువగా ఉన్నాయి. నగరంలోనే రోజుకు వేల సంఖ్యలో ముహూర్తాలు ఉన్నాయి. మళ్లీ జనవరి 23 నుంచి శుభకార్యాలు ఉంటాయి. ప్రస్తుత తరుణంలో పురోహితుల లభ్యత చాలా కష్టతరంగా ఉన్నది.
– జనమంచి శేఖర్శర్మ, పురోహితులు
ఫొటోలే తీపి జ్ఞాపకాలు..
వచ్చేనెల 2వ తేదీ నుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో ఫొటోగ్రాఫర్లకు మంచి డిమాండ్ ఉన్నది. రెండు నెలల ముందే బుకింగ్ అయ్యాయి. చాలామంది లేటెస్ట్ ట్రెండ్తో ఫొటోలు తీయిస్తున్నారు. ఇందుకు రూ. లక్షల్లో వెచ్చిస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్లకు మంచి గిరాకీ ఉన్నది. ఎక్కువ మంది ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక్క ప్రీ వెడ్డింగ్ షూట్కే రూ.10 వేలకు పైగా ఖర్చవుతుంది. అత్యాధునిక టెక్నాలజీతో పెండ్లి వేడుక మొత్తం ఫొటోలు, వీడియోల కోసం రూ.లక్షల్లో అవుతుంది. కానీ, ఫొటోలో రేపు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.
– నవీన్, ఫొటోగ్రాఫర్