రంగారెడ్డి, నవంబర్ 30(నమస్తే తెలంగాణ): పదో తరగతి పరీక్షల్లో జిల్లాను అగ్ర స్థానంలో నిలిపేందుకు రంగారెడ్డి జిల్లా విద్యా శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. నేటి నుంచి ఫిబ్రవరి 23 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నది. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు గంటల పాటు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ నెలాఖరు వరకు 100 శాతం సిలబస్ పూర్తి చేసేలా విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి నుంచి స్లిప్ టెస్ట్లు నిర్వహించి విద్యార్థులు ఏయే విషయాల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి.. ఆయా సబ్జెక్టుల వారీగా ప్రత్యేక అవగాహన కల్పించనున్నారు. ఉత్తమ ఫలితాలు రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దనున్నారు. జిల్లాలో 1309 ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి.
మార్చి/ఏప్రిల్లో జరుగనున్న పదో తరగతి పరీక్షల్లో రంగారెడ్డి జిల్లాను ఉత్తమ స్థానంలో నిలిపేందుకు విద్యా శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 80% సిలబస్ పూర్తవగా, డిసెంబర్ నెలాఖరుకు 100 శాతం పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జనవరి నుంచి స్లిప్ టెస్ట్లు నిర్వహించి విద్యార్థులు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో తెలుసుకొని, వారిని తీర్చిదిద్దనున్నారు.
నేటి నుంచి జిల్లా అధికారులు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని 1309 ఉన్నత పాఠశాలల్లో పక్కా ప్రణాళికతో చదివించేలా జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో యాక్షన్ ప్లాన్ను తయారు చేశారు.
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా..
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలో 1319 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పరంగా వేలాది మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో 20 కేజీబీవీ, తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ 19, ఎయిడెడ్ స్కూల్స్ 14, మైనార్టీస్ వెల్ఫేర్స్ 9, మహత్మా జ్యోతిబా పూలె పాఠశాలలు 28 ఉన్నాయి.
ఉత్తమ ఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యా శాఖ కసరత్తు చేస్తున్నది. ఫిబ్రవరి 23వ తేదీ వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల వరకు తరగతుల నిర్వహణతో పాటు చదివించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేయాలన్నారు. ప్రధానంగా గణితం, ఇంగ్లిష్, సైన్స్ సబ్జెక్టులకు ప్రత్యేకంగా అదనపు తరగతులను నిర్వహిస్తున్నారు. తుది పరీక్షల్లో విద్యార్థులు సత్ఫలితాలు సాధించేలా ప్రభుత్వ పాఠశాలలు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నారు.
ఉత్తమ ఫలితాలు సాధించేలా…
ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా కసరత్తు చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ, ఆయా విషయాలపై ప్రత్యేక టెస్ట్లను పెడుతున్నాం. సబ్జెక్టుల వారీగా సందేహాలను నివృత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– సుశీందర్ రావు, డీఈవో, రంగారెడ్డి జిల్లా