సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) ;విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు ఆలవాలం దక్కన్ పీఠభూమి. అందునా తెలంగాణ సంస్కృతి మరింత ప్రత్యేకం. ఎందరు వచ్చిన తల్లిలా ఆదరించి అక్కున చేర్చుకునే నెనరుగల్ల భూమి, అనురాగాలు ఆప్యాయతలు పంచే మనసున్న గడ్డ తెలంగాణ. చూపు తిప్పుకోనివ్వని ప్రకృతి రమణీయత.. సహజ జలవనరులు, దట్టమైన అడవులు, అబ్బురపరిచే ప్రాచీన రాతికట్టడాలు, కొండ కోనలు, కోటలు, అడుగడుగునా గుడి, ఆధ్యాత్మిక క్షేత్రాలు, తరగని గనులు, పసిడి సిరులు కురిపించే మాగాణం, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే సబ్బండ వర్ణాల సహజీవనం, ఒకటేమిటి వేల ఏండ్ల చరిత్రను తన గర్భంలో దాచుకున్న తెలంగాణ నేలతల్లి.. వైవిధ్యమైన జీవావరణంతో భిన్న సంస్కృతులకు అద్దంపడుతున్నది. ఒక్క మాటలో కోటి రతణాల వీణ నా తెలంగాణ అన్న మహాకవి దాశరథి మాటలు సదా స్మరణీయం. కాగా, శనివారం గోల్కండ మెట్లబావికి యునెస్కో గుర్తింపునివ్వడాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకం హర్షిస్తున్నది. ఐతే ఈ సందర్భంలో ఇంతటి ఘనమైన చరిత్ర కలిగి అన్ని అర్హతలు ఉన్న తెంగాణలోని ఇతర చారిత్రక కట్టడాలకు కూడా గుర్తింపు లభించాలి. అది న్యాయమైన డిమాండ్ కూడా. అయితే యునెస్కో ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 25 వరకు ప్రపంచ వారసత్వ వారొత్సవాలు 2022 నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో మన చారిత్రక వైభవానికి ప్రతీకలుగా నిలిచిన గోల్కొండ కోట, చార్మినార్, కుతుబ్మినార్ తదితర కట్టడాలకు సముచిత గౌరవం దక్కాల్సిందేనని చరిత్రకారులు, పరిశోధకులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూనుకొని తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నది. మన వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన వారసత్వ సంపదను ఈ సందర్భంగా మరోసారి పరామర్శించుకుందాం.
తరగని చరిత్రకు పేరెన్నికగన్న తెలంగాణకు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందని చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దక్కన్ ప్రాంతంలో టన్నుల కొద్దీ చరిత్ర, సాంస్కృతిక వైభవం కలిగి, గంగాజెమునా తెహజీబ్ సంస్కృతి పరిఢవిల్లిన నేల ఇది. ఎంతో వైవిధ్యానికి పేరొందిన తెలంగాణలోని పలు చారిత్రక కట్టడాలకు సరైన గుర్తింపు రావాలని, చారిత్రక సౌధం గోలొండ కోటకు ప్రపంచ వారసత్వ సంపదలో చోటు దక్కాల్సిందేనని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు చార్మినార్, కుతుబ్షాహీ టూంబ్స్కు ఉమ్మడిగా స్థానం దక్కాల్సిందేనని.. ఇప్పటికే గత ప్రభుత్వం యునెస్కోకు పంపిన లేఖలో విజ్ఞప్తి చేసింది. ఇవేకాకుండా అనేక చారిత్రక రాతి శిలలు హైదరాబాద్ చుట్టుముట్టూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కట్టడాలు, కోటలు, పర్యాటక ప్రాంతాలు సైతం తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయని వాటికి సైతం సరైన గుర్తింపు దక్కాలని పలువురు చరిత్రకారులు, పరిశోధకులు గుర్తు చేస్తున్నారు.
2010లోనే ప్రతిపాదన..
2010లోనే నగరంలోని చార్మినార్, కుతుబ్షాహీ టూంబ్స్, గోల్కొండ కోటకు యునెస్కో ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ కట్టడాల స్థానంలో గుర్తింపు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కొన్ని కారణాల వల్ల చార్మినార్ ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో నిలువలేక పోగా 2014లో తిరిగి మరోసారి యునెస్కోకు లేఖ రాసినా నిష్ప్రయోజనమైంది. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని పరిశోధకులు పేర్కొంటున్నారు.
వారసత్వ కట్టడాలకు కొదవలేదు
తెలంగాణ రాష్ట్రంలో వారసత్వ కట్టడాలకు, చారిత్రక ప్రాంతాలకు కొదవలేదు. అనేక ప్రాంతాల్లో ఓన్నో విశిష్టతలు, పురాతన అంశాలతో కూడిన అనేక రాతికట్టడాలు ఉన్నాయి. ఇప్పటికే దక్కన్ హెరిటేజ్ గుర్తింపు రావాల్సి ఉండె. కానీ అనుకున్నస్థాయిలో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవతీసుకోవాల్సి ఉండింటే బాగుండేది. భువనగిరి గుట్ట, కరీంనగర్లోని బొమ్మలగుట్ట లాంటి అనేక రాతిశిలలను కూడా వారసత్వ సంపదగా గుర్తించొచ్చు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు, పౌరసమాజం కూడా వారసత్వ ప్రదేశాల సంరక్షణకు కృషి చేయాలి.
-మణికొండ వేదకుమార్,చైర్మన్, ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్
దక్కన్ ప్రాంతానికే తలమానికం
గ్రేటర్ హైదారాబాద్కే కాదు దక్కన్ భూభాగంలో గోల్కొండ కోట తలమానికంగా పేరొందింది. నవాబుల చారిత్రక సౌధాన్ని తెలంగాణ పభుత్వం పరిరక్షించేందుకు ఇప్పటికే కృషి చేస్తుండటం అభినందించాలి. నగర పర్యాటలకుతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల వారితోపాటు విదేశీ పర్యాటకులు గోల్కొండను సందర్శించి చారిత్రక అంశాలను తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్కు శివారులోనే కోట ఉండటంతో పర్యాటలకుందరూ సందర్శించేందుకు మక్కువ చూపుతారు. ఇక యూనెస్కో వారసత్వ సంపద జాబితాలో చేరితే మరింత అభివృద్ధితోపాటు గోల్కొండ కోటను తీర్చిదిద్దేందుకు అవకాశం దొరుకుతుంది.
– అడపా సత్యనారాయణ,ఓయూ విశ్రాంత ప్రొఫెసర్, చరిత్ర విభాగం
శాతవాహనుల చారిత్రక ప్రదేశం కొండాపూర్..
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ గ్రామానికి పకనే కోటగడ్డగా పిలుచుకునే 85 ఎకరాల మట్టి దిబ్బల కింద శాతవాహన కాలపు వైభవం దాగి ఉన్నది. 1900 సంవత్సరంలో హెన్రీ కౌసెన్స్ ఇకడ ‘ఒక ప్రాచీన నగరం’ ఉందని, అంతకంటే ముందే మధ్య రాతియుగం, కొత్త రాతియుగం ఆనవాళ్లు కూడా ఇకడ ఉన్నాయని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ తర్వాత నిజాం ప్రభుత్వ ఆరియాలజీ శాఖ 1937లో ఖ్వాజా మహ్మద్ అహ్మద్ నేతృత్వంలో పరిశోధన జరిపారు. 1940-42 మధ్య తవ్వకాలు జరిగాయి. మళ్లీ 2009-2011 మధ్య ఆరియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తవ్వకాలు జరిపింది. మొదటి తవ్వకాల్లో దొరికిన అవశేషాలు ఇప్పుడు కొండాపూర్లోని సైట్ మ్యూజియంలో ఉన్నాయి. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక నిర్మాణాలు, బౌద్ధ స్థూప, చైత్యాల ఆనవాళ్లు తవ్వకాల్లో బయటపడ్డాయి. వీటిపై క్రీస్తుశకం 1వ శతాబ్దం నాటి బ్రహ్మీ లిపి అక్షరాలున్నాయి. ఇకడ దొరికిన చైత్యం, స్థూపం, బుద్ధుడి పాదాలు, కుండపై త్రిరత్న ముద్ర వంటి ఎన్నో బౌద్ధ అవశేషాలు దొరికాయి.