రంగారెడ్డి, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : రాజ్యాంగాన్ని ప్రతిఒక్కనై గౌరవించాలని తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ, జడ్జి గోవర్ధన్రెడ్డి అన్నారు. జాతీయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ‘రంగారెడ్డి బార్ అసోసియేషన్ సమన్వయంతో’ శనివారం రాజ్యాంగ దినోత్సవం, ఇంకా వరకట్న నిర్మూలన దినోత్సవాన్ని జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఏ.శ్రీదేవి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆహ్వానితులను ఉద్దేశించి జడ్జి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులను సరైన విధంగా వినియోగించుకోవాలని, ఒక వేళ హక్కులను వినియోగించుకోవడంలో ఏదైనా సమస్య ఉన్నా రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతి పౌరుడికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని అన్నారు.
రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ హరికృష్ణ భూపతి మాట్లాడుతూ.. వరకట్న నిర్మూలనకు అందరు సహకరించాలని.. వరకట్నం, మూఢ నమ్మకాలతో మహిళలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ఉదాహరణలతో వివరించారు.
కార్యక్రమంలో ఎన్జీవోస్, ట్రాఫిక్ పోలీస్, పారా లీగల్ వలంటీర్లు, ప్రభుత్వ అధికార సంస్థల వలంటీర్లు వారి సంస్థ సేవల గురించి.. వారి వారి చేతి వృత్తుల వస్తువుల స్టాల్స్, ఇంకా పాంప్లెట్స్ ద్వారా ప్రదర్శించారు. మూఢ నమ్మకాలపై మ్యాజిక్ షోను రంగారెడ్డి బార్ అసోసియేషన్ నిర్వహించింది.
కార్యక్రమంలో మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి తిరుపతి, రంగారెడ్డి జిల్లా అడ్వకేట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుధాకర్రెడ్డి, ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విద్యారెడ్డి, అడ్మిన్ పీపీ కస్తూరీ, బార్ అసోసియేషన్ సెక్రటరీ దేవరాజ్ గౌడ్, జిల్లా కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సైబరాబాద్ అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, రాచకొండ డీసీపీ వెంకటేశ్వర్లు, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, తక్షశిల స్కూల్ విద్యార్థులు, లా విద్యార్థులు, జిల్లా కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, న్యాయ సేవా సదన్ ఉద్యోగులు పాల్గొన్నారు.
రాజ్యాంగానికి లోబడి విధులు నిర్వహించాలి
ప్రతి వ్యక్తి తాను నిర్వహించే విధులను రాజ్యాంగానికి లోబడి మాత్రమే నిర్వహించాలని జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం 73వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. డీఈవో సుశీందర్రావు, ఏవో ప్రమీలతో కలిసి భారత రాజ్యాంగం పీఠిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సుశీందర్ రావు మాట్లాడుతూ.. రాజ్యాంగానికి లోబడే విధులు నిర్వహించాలని, మరే ఇతర వ్యక్తులు, హోదాలకు కాదని తెలిపారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ మొదలగు సర్వమత పవిత్ర గ్రంథాలతో సమానమైన భారత రాజ్యాంగంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.