మంచాల, అక్టోబర్ 19 : ఎన్నో ఏండ్లుగా వర్షపునీరు వృధాగా పోవడంతో ఈ ప్రాంతం ఎడారిగా మారింది. రెండుకొండల మధ్యనుంచి వచ్చే వర్షపునీటిని ఒడిసిపట్టేందుకు గత ప్రభుత్వాల హయాంలో చెక్డ్యాం నిర్మాణానికి పూనుకున్న నిధులు మంజూరు చేయకపోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. తెలంగాణ ప్రభుత్వంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చొరవతో వృధాగా పోతున్న నీటిని ఒడిసిపట్టేందుకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే చెక్డ్యాం నిర్మాణానికి రూ.3.9కోట్లను మంజూరు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న బీడుభూములు త్వరలో సాగులోకి రావడమే కాకుండా ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలంగా మారనున్నది. మంచాల మండలం ఎల్లమ్మతండా గ్రామసమీపంలో గాడివంపువాగు చెక్డ్యాం నిర్మాణం కోసం గత ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయాంలో ముంపునకు గురయ్యే రైతులకు తగిన నష్టపరిహారం ఇవ్వకుండానే చెక్డ్యాం కోసం రూ.1.5కోట్లను కేటాయించారు. అయితే, తగిన నష్టపరిహారం ఇచ్చేవరకు పనులు ముందుకు సాగకపోవడంతో చెక్డ్యాం నిర్మాణం కోసం కేటాయించిన నిధులు తిరిగి ప్రభుత్వ ఖాతాలోకే చేరాయి. నిధులు కేటాయించడమే కాని, భూసర్వే, ముంపునకు గురయ్యే రైతులు ఎంతమంది ఉన్నారని వివరాలు కూడా సేకరించిన దాఖలాలు లేవు.
రూ.3.9కోట్లను కేటాయించిన ప్రభుత్వం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లమ్మతండా గ్రామసమీపంలో ఉన్న గాడివంపువాగు చెక్డ్యాం నిర్మాణం కోసం రూ.3.9కోట్లను కేటాయించింది. ఎల్లమ్మతండా నుంచి లోయపల్లి వరకు సుమారు ఐదువందల పైచిలుకు ఎకరాల బీడుభూములు సాగులోకి రానున్నాయి. గాడివంపు వాగు నిర్మాణం చేపడితే ఈ ప్రాంతం భూములు సస్యశ్యామలంగా మారడమే కాకుండా భూగర్భజలాలు పెరిగి ఈ ప్రాంతం సస్యశ్యామలం కానున్నది. ఇప్పటికే ఇరిగేషన్శాఖ, రెవెన్యూ అధికారులు సర్వేయర్ ఈ ప్రాంతంలో పర్యటించి ముంపునకు గురయ్యే రైతుల వివరాలతో పాటు ఎన్ని ఎకరాలు భూమి గాడివంపువాగులో కోల్పోతున్నారనే విషయాన్ని పూర్తి నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి అందజేయడమే కాకుండా చెక్డ్యాం నిర్మాణంలో భూమిని కోల్పోతున్న రైతు కుటుంబాలకు ఎకరానికి రూ.10లక్షల చొప్పున రైతుల ఖాతాలో డబ్బులను కూడా జమచేశారు.
ఎకరాకు రూ.10లక్షలు అందజేత..
ఎల్లమ్మతండా సమీపంలో నిర్మిస్తున్న గాడివంపువాగు చెక్డ్యాం నిర్మించే ప్రాంతంలో 18ఎకరాల భూమి ముంపునకు గురవుతున్నది. అందులో 14మంది రైతులున్నారు. వారికి పట్టాభూమికి ఎకరానికి రూ.10లక్షల చొప్పున అసైన్డ్మెంట్భూమికి ఎకరానికి రూ.8లక్షల చొప్పున ప్రభుత్వం ముంపునకు గురయ్యే రైతులకు నష్టపరిహారం అందజేసింది. గాడివంపువాగు చెక్డ్యాం నిర్మాణం చేపడితే ఎల్లమ్మతండాతో పాటు బోడకొండ, ఆంబోతుతండా, సత్తితండా, లోయపల్లితో పాటు తదితర తండాల్లో నీటి వనరులకు కొదవ లేకుండా పోతుంది.
సాగునీరు అందివ్వడమే లక్ష్యం
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బీడుభూములను సాగులోకి తీసుకువచ్చేందుకు శివన్నగూడ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని తీసుకువచ్చి ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలను నింపడంతో పాటు ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. అందులో భాగంగానే మంచాల మండలం ఎల్లమ్మతండా సమీపంలోని గాడివంపు కింద పంటలను సాగుచేసుకునేందుకు చెక్డ్యాంను నిర్మిస్తున్నాం. ప్రభుత్వం నుంచి రూ.3.9కోట్లను మంజూరు చేయించాం. ఈ పనులను త్వరలోనే ప్రారంభిస్తాం.
– మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే
ఎమ్మెల్యే కృషి మరువలేనిది
గాడివంపువాగు చెక్డ్యాం నిర్మాణం కోసం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చేస్తున్న కృషి మరువలేనిది. ఎమ్మెల్యే చొరవతో గాడివంపు వాగు నిర్మాణానికి నిధులు మంజూరుచేయించడమే కాకుండా భూమి కోల్పోతున్న రైతులకు కూడా రూ.10లక్షల చొప్పున నష్టపరిహరం అందజేసి వారికి అండగా నిలిచారు.
– జాటోతు నర్మద, ఎంపీపీ
రైతుల ఖాతాలో డబ్బులు జమ..
ఎల్లమ్మతండా సమీపంలో నిర్మించనున్న గాడివంపు వాగు చెక్డ్యాంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం కింద ఎకరానికి రూ. 10లక్షల చొప్పున రైతు అకౌంట్లలో డబ్బులు జమచేశాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పట్టా, అసైన్మెంట్ భూములు కలిగిన రైతులకు కూడా నష్టపరిహారాన్ని అందజేశాం. చెక్డ్యాం నిర్మాణానికి రైతుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవు. – అనిత, తహసీల్దార్