ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 17 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ పట్టనుంది. రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలోని ప్రధాన రహదారులను కలుపుతూ.. పలు గ్రామాలకు వెళ్లే రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చే పనులకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించింది. ఈ నిధులతో నియోజకవర్గంలోని అనేక రోడ్ల విస్తరణ పనులు చకచకా సాగుతున్నాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గతంలో రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్ల మరమ్మతుపై దృష్టి సారించారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో నాగార్జునసాగర్-హైదరాబాద్, విజయవాడ-హైదరాబాద్, ఇబ్రహీంపట్నం నుంచి శ్రీశైలం-హైదరాబాద్ రహదారికి అనుసంధానం చేస్తూ డబుల్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పెరుగుతున్న వాహనాల రద్దీతో పాటు గ్రామాల మధ్య దూరభారం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ రోడ్ల మరమ్మతుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. నియోజకవర్గంలో ఒకేసారి 22 రోడ్లు డబుల్ రోడ్లుగా మారనుండటంతో ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని సాగర్ రహదారి విస్తరణతో పాటు మధ్య నుంచి డివైడర్లు నిర్మించి ఇంజాపూర్ నుంచి ఖానాపూర్ గేటు వరకు, యాచారంతోపాటు మాల్, విజయవాడ రహదారిలో అబ్దుల్లాపూర్మెట్ నుంచి కొత్తగూడెం గేటు వరకు రహదారి మరమ్మతులతోపాటు సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేశారు.
ఇబ్రహీంపట్నం నుంచి నాగన్పల్లి, పోల్కంపల్లి, అనాజ్పూర్ మీదుగా విజయవాడ ప్రధాన రహదారిని కలిపే రోడ్డును రూ.24.55 కోట్లతో డబుల్ రోడ్లుగా మార్చే పనులు చకచకా సాగుతున్నాయి. సాగర్ రోడ్డు నుంచి ఎలిమినేడు, మంగల్పల్లి, బొంగుళూరు నుంచి సాగర్ రోడ్డు వరకు రూ.58కోట్లతో డబుల్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ఆగాపల్లి నుంచి తులేకలాన్ వరకు రూ.3.9కోట్లతో ఫారెస్టులో మిగిలిపోయిన రోడ్డు మరమ్మతు పనులు కూడా పూర్తిచేసే పనులు కొనసాగుతున్నాయి. పోచారం నుంచి రాంరెడ్డిగూడ మీదుగా కొంగరకలాన్ వరకు రూ.9కోట్లతో రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. యాచారం నుంచి మీరఖాన్పేట్ వరకు రూ.88కోట్లతో డబుల్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. నందివనపర్తి నుంచి మేడిపల్లి వరకు రూ.40కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు పనులు చకచకా సాగుతున్నాయి.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మరో మూడు వంతెనల నిర్మాణాలకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రతిపాదనలు పంపగా.. వాటి నిధుల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వీటిలో విజయవాడ జాతీయ రహదారి నుంచి మజీద్పూర్ మీదుగా నెర్రపల్లికి వెళ్లే ప్రధాన రోడ్డుపై వంతెన నిర్మాణంతోపాటు అబ్దుల్లాపూర్మెట్ నుంచి లష్కర్గూడ గ్రామానికి వెళ్లే రోడ్డులో మధ్యలో ఉన్న మరో వంతెన నిర్మాణ పనులకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు తెలిసింది. అలాగే, గౌరెల్లి నుంచి ప్రతాపసింగారం గ్రామాల మధ్య రూ.3.50కోట్లతో వంతెన నిర్మాణం పనులకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మరిన్ని ప్రధాన రోడ్ల మరమ్మతులతో పాటు డబుల్ రోడ్లుగా మార్చే పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. త్వరలోనే నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం. నియోజకవర్గంలోని రోడ్ల వ్యవస్థను మెరుగుపర్చడం కోసం అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. ఇప్పటికే సాగర్ రహదారి నుంచి బీడీఎల్ మీదుగా క్లస్టర్ పార్కు వరకు రోడ్డు పనులు పూర్తయ్యాయి. త్వరలోనే డబుల్ రోడ్ల నిర్మాణం పూర్తిచేస్తాం.
– మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం