కొందుర్గు, జూలై 1: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంతో గ్రామాలు, పట్టణాల్లో విరివిగా మొక్కలు నాటి పెంచాలన్నది ప్రభుత్వ సంకల్పం. లక్షల రూపాయలను ఖర్చు చేసి నర్సరీల ద్వారా మొక్కలను పెంచి గ్రామాల్లోని రైతుల పొలాలు, ప్రభుత్వ స్థలాల్లో పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొక్కలను ఉచితంగా సరఫరా చేయడంతో పాటు నెలకు ఒక్క మొక్కకు ఐదు రూపాయల చొప్పున రైతులకు నిర్వహణ ఖర్చులు కూడా సర్కార్ అందజేస్తున్నది. గ్రామంలో ఎక్కువ మొక్కలు నాటడం వల్లన పర్యావరణ పరిరక్షణతో పాటు కాలుష్య నివారణ చర్యలు చేపడుతున్నది. అందుకనుగుణంగా ప్రతి గ్రామంలో మొక్కలు విరివిగా నాటాలని అధికారులు పేర్కొంటున్నారు.
కొందుర్గు, జిల్లెడ్చౌదరిగూడ మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ, సోషల్ ఫారెస్ట్ వారి ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. జిల్లెడ్ చౌదరిగూడ మండలంలోని పెద్ద ఎల్కిచర్ల గ్రామంలో సోషల్ ఫారెస్ట్ నర్సరీలో లక్షా 25వేలు, జిల్లెడ్ చౌదరిగూడ మండలంలోని అన్ని గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సరీలో 18వేల మొక్కలు పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు.
మొక్కలు నాటేందుకు నర్సరీల్లో సిద్ధంగా వున్నాయని అధికారులు తెలిపారు. మండలంలో అన్ని గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు తయారు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఒక్కో గ్రామానికి 18వేల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇతర మండలాల నుంచి కూడా మొక్కలు తీసుకువచ్చి నాటిస్తామని అధికారులు తెలిపారు.
కొందుర్గు, జిల్లెడ్చౌదరిగూడ మండలాల్లోని అన్ని గ్రామాల్లో పకడ్బందీగా మొక్కలు నాటి పెంచేందుకు ప్రణాళికలు తయారు చేసినట్లు అధికారులు తెలిపారు. మొక్కలు విరివిగా నాటడం వల్లన ఎంతో ఉపయోగం వుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హరతహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విరివిగా మొక్కలు నాటేలా చూడాలని అధికారులు కోరారు.
కొందుర్గు, జిల్లెడ్చౌదరిగూడ మండలాల్లోని అన్ని గ్రామాల్లో మొక్కలు నాటేందుకు గుంతల తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ప్రతి గ్రామంలో 18వేల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ప్రభుత్వం మా మండలాలకు ఇచ్చిన లక్ష్యాన్ని చేరడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం.
– నర్సింగరావు, ఏపీవో కొందుర్గు, మండలం