మంచాల, జూన్ 24 : గ్రామీణ ప్రాంతాల్లో యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. పల్లెప్రకృతి, హరితహారంతో ఇప్పటికే గ్రామాలు సరికొత్త రూపును సంతరించుకోగా.. ప్రభుత్వం ఊరుకో ఆటస్థలం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంచాల మండలంలో 31 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలకు స్థలాలు గుర్తించడమే కాకుండా కొన్ని గ్రామాల్లో పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మండలంలో ఆగపల్లి, మంచాల, ఆరుట్ల, నోముల, రంగాపూర్ తదితర గ్రామాల్లో క్రీడా స్థలాల్లో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో ఉన్న యువతకు క్రీడలపై ఉన్న ప్రాధాన్యతను గుర్థించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీతోపాటు అనుబంధ గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని తలపించి శరవేగంగా ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో 31 గ్రామాల్లో రెవెన్యూ అధికారులు స్థలాలను గుర్తించారు. కొన్ని గ్రామాల్లో క్రీడా స్థలాలు లేకపోవడంతో అనువైన స్థలాలను వెతకడంలో నిమగ్నమయ్యారు. అందులో ఇప్పటి వరకు 25 గ్రామాల్లో క్రీడాప్రాంగణాలను గుర్తించారు.
క్రీడలను ప్రోత్సాహించడంతోపాటు గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గ్రామ పంచాతీలల్లో ఎకరం నుంచి, రెండు ఎకరాల్లో క్రీడాస్థలాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిశ్చయించుకున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో అధికారులు క్రీడాస్థలాలను గుర్తిస్తున్నారు. క్రీడా మైదానంలో భాగంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. మంచాల రెవెన్యూ అధికారులు ఇప్పటికి 25 గ్రామాల్లో క్రీడా మైదానాలను గుర్తించారు.
ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయా గ్రామాలతో పాటు అనుబంధ గ్రామాల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నది. మండలంలో 26 రెవెన్యూ గ్రామాలుండగా.. అందులో 25గ్రామాల్లో స్థలాలను గుర్తించి పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు.
– అనిత, తహసీల్దార్
గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా స్థలాలను గుర్తించి క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా క్రీడాకారులను పట్టించుకున్న పాపానపోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవవో నేడు గ్రామాల్లో క్రీడా స్థలాలను గుర్తించడమే కాకుండా క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని కల్పించి తగిన గుర్తింపు ఇస్తున్నారు.
– హరిప్రసాద్, సర్పంచ్