షాబాద్ : బాల కార్మిక, వెట్టి చాకిరి వ్యవస్థలను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఎల్బీనగర్లో ఏర్పాటు చేసిన బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మైనర్ పిల్లల కోసం పనిచేసే అన్ని డిపార్ట్మెంట్స్ కొవిడ్ సమయంలో చాలా బాగా పని చేశాయన్నారు.
ఇకముందు కూడా అన్ని శాఖల వారు సమన్వయంగా పని చేయాలని, కొవిడ్ మూలంగా అనాథలైన పిల్లలందరిని మనమే ఆదుకోవాలని సూచించారు. బాలల కార్మిక, వెట్టి చాకిరి వ్యవస్థలను రూపు మాపాలని, చైల్డ్ మ్యారేజ్, చిన్న పిల్లలపై అఘాయిత్యాలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న పిల్లల కోసం పనిచేసే అన్ని శాఖలు కో-ఆర్డినేషన్తో ముందుకు పోవాలని, పిల్లల కోసం ఏమి అవసరమైనా తాము ముందుంటామని జిల్లా లీగల్ సర్వీస్ సెక్రటరీ శ్రీదేవి అన్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు సుమారు 1200 కేసులు రాటిపికేషన్ పూర్తి చేశామని, చిన్న పిల్లల విషయంలో జేజే యాక్ట్ అమలయ్యే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు నరేందర్రెడ్డి చెప్పారు.
కొవిడ్ సమయంలో అనాథ పిల్లలకు ఎడ్యుకేషన్ సపోర్ట్ చేశామని, జేజే ఫండ్ నుంచి వారికి స్కూల్ ఫీజు కట్టిన్నట్లు తెలిపారు. 655 కొవిడ్ పాక్షిక అనాథలకు ఇప్పటి వరకు గ్రాసరీస్ ఇచ్చామని, కొందరికి ఫీ వేవర్ చేయించామని జిల్లా స్త్రీ శిశు వికలాంగుల, వయోవృద్దుల సంక్షేమాశాఖ అధికారి మోతి వివరించారు. పసి పిల్లలు తప్పులు చేస్తే వారు అలా చేయడానికి కారణాలు తెలుసుకుని తిరిగి పిల్లలు ఆ విధంగా తప్పులు చేయకుండా చూడాలని, వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని జస్టీస్ బోర్డ్ సోషల్ వర్కర్ వారు తెలిపారు. అనాథ పిల్లలకు ప్రభుత్వమే అండగా ఉంటుందని, ఎవరు కూడా అనాథలుగా ఉండటానికి వీలు లేదని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఏసీపీ సలీమా, డీసీపీ కిశోర్ స్పష్టం చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ సంరక్షణ కేంద్రాల నుంచి వచ్చిన పిల్లలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఆటల పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యలో ప్రతిభ కనబర్చిన వారికి కూడా నగదుతో పాటు బహుమతులు అందజేసినట్లు తెలిపారు. పిల్లలతో కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో బీఆర్సీ కో-ఆర్డినేటర్ హర్షవర్దిని, బాలల సంరక్షణ అధికారి ప్రవీణ్కుమార్, సీడీపీవోలు, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు, వివిధ సీసీఐల ఇన్చార్జిలు, చైల్డ్లైన్ కో-ఆర్డినేటర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.