షాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడం దారుణమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం చేవెళ్ల, శంకర్పల్లి మండల కేంద్రాల్లో నిర్వహించిన రైతుధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా అనేక కార్యక్రమాలు అమలు చేసి అండగా నిలుస్తుందని తెలిపారు. రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి సాయం అందించి అన్నదాతల ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసి సాగు, తాగునీరు అందించి తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో వరిధాన్యం పండించడం జరిగిందని, పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీలు విజయలక్ష్మి, గోవర్ధన్ రెడ్డి, జడ్పీటీసీలు మాలతీ, గోవిందమ్మ, మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, గోపాల్, వాసుదేవ్కన్నా, మహిళా అధ్యక్షురాలు అనిత, మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చిరెడ్డి, పీఏసీఏస్ చైర్మన్ శశిధర్రెడ్డి, తదితరులు ఉన్నారు.