రంగారెడ్డి, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : గత ప్రభుత్వాలు విస్మరించిన చెరువులకు మిషన్ కాకతీయ కార్యక్రమంతో పూర్వ వైభవం తీసుకువచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులను కాపాడేందుకుగాను అన్ని చర్యలను చేపట్టింది. ఎఫ్టీఎల్ భూముల కబ్జాలకు పాల్పడగా.. గతేడాది హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చెరువులు నిండి చాలా కాలనీలు నీళ్లలో మునిగిపోయిన పరిస్థితి నెలకొనడంతో దాదాపు పదిహేను రోజులపాటు అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకుగాను ప్రతి చెరువును డిజిటల్ సర్వే చేయడంతోపాటు ఎఫ్టీఎల్ గుర్తించే ప్రక్రియను జిల్లా అంతటా నిర్వహిస్తున్నారు. ఏదేమైనా గత ప్రభుత్వాలు విస్మరించిన చెరువులకు పూర్వ వైభవం తీసుకురావడంతోపాటు చెరువులు కబ్జాలకు గురికాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.
ఇప్పటివరకు 860 చెరువులకు ఎఫ్టీఎల్ గుర్తింపు…
జిల్లాలో 2339 చెరువులుండగా 69వేల ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉంది. అయితే హెచ్ఎండీఏ పరిధిలో 1078 చెరువుల్లో ఇప్పటివరకు 860 చెరువులకు సంబంధించి సర్వే పూర్తి కావడంతోపాటు ఎఫ్టీఎల్ గుర్తించే ప్రక్రియను కూడా పూర్తి చేశారు. మరో 218 చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నది.
జిల్లాలో 2339 చెరువులు.. 69వేల ఎకరాల ఆయకట్టు
జిల్లావ్యాప్తంగా 2339 చెరువులుండగా.. 69,197 ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉంది. జిల్లాలోని ఆయా డివిజన్లోని చెరువులకు సంబంధించి ఇబ్రహీంపట్నం డివిజన్లో 875 చెరువులుండగా అబ్దుల్లాపూర్మెట్ మండలంలో 141, హయత్నగర్లో 7, ఇబ్రహీంపట్నంలో 122, మంచాలలో 301, యాచారంలో 137, సరూర్నగర్లో 5, బాలాపూర్లో 48, మాడ్గులలో 114 చెరువులున్నాయి. శంషాబాద్ సబ్ డివిజన్లో 579 చెరువులుండగా 14,942 ఎకరాల ఆయకట్టు ఉంది. చేవెళ్ల డివిజన్లో మొత్తం 306 చెరువులుండగా 9671 ఎకరాల ఆయకట్టు ఉంది. షాద్నగర్ డివిజన్లో 579 చెరువులుండగా 19,996 ఎకరాల ఆయకట్టు ఉంది.
ఇప్పటికే జియో ట్యాగింగ్ పూర్తి…
ఇప్పటికే మిషన్ కాకతీయ పనులతో జిల్లాలోని చెరువులకు జలకళ రాగా, ప్రస్తుతం కబ్జాలకు గురవుతున్న చెరువులను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లాలోని అన్ని చెరువులకు సంబంధించి జియో ట్యాగింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. జియో ట్యాగింగ్ ప్రక్రియతో జిల్లాలో ఎన్ని చెరువులున్నాయి, చెరువుల ఫొటోలతోపాటు తూము, అలుగు వివరాలు నీటి పారుదల శాఖ సిబ్బంది సేకరించి, వివరాలను ఆన్లైన్లో పొందుపర్చారు. దీంతో ఒక్క క్లిక్తో జిల్లాలోని ఏ చెరువు ఎక్కడుంది, సంబంధిత చెరువు తూము, అలుగు పూర్తి వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా చెరువుల నీటి నిల్వ సామర్థ్యం కూడా పక్కాగా తెలిసిపోతుంది. అయితే ఎఫ్టీఎల్ గుర్తించే ప్రక్రియ పూర్తైన తర్వాత మరోసారి ఆన్లోన్లో వివరాలను పొందుపర్చనున్నారు.