షాద్నగర్, జూన్15: రంగారెడ్డి జిల్లాలోని అర్హులైన రైతులందరి ఖాతాల్లో రైతుబంధు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం జమ చేస్తున్నదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. విడుతలవారీగా అందరి ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమచేస్తారని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువుల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ రైతులు కూరగాయాల సాగుపై మొగ్గుచూపేలా అధికారులు అవగాహన పెంచాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించినట్లు తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ హెచ్చరించారు. వర్షాకాలం వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఆమనగల్లు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ దవాఖానలో 30 పడకలను ఏర్పాటుచేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కోరారు. హరిత హారం పథకం ద్వారా విస్తారంగా మొక్కలను నాటేందుకు ప్రణాళికలను సిద్దంచేయాలని జిల్లా పంచాయతీ అధికారి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. హిమాయత్నగర్ నుంచి చిలుకూరు వరకు రహదారి పనులను, బీజాపూర్ జాతీయ రహదారి పనులను త్వరగా పూర్తిచేయాలని చేవేళ్ల ఎమ్మెల్యే యాదయ్య ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. కరోనా నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఆన్లైన్ ద్వారా నిర్వహించామని, నాగర్కర్నూల్ ఎంపీ రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్, షాద్నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్లతో పాటు మండలాల జడ్పీటీసీలు సమావేశంలో పాల్గొన్నారని అధికారులు తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.