ఇబ్రహీంపట్నంరూరల్ : అనుమతులతో పాటు, డ్రైవింగ్ లైసెన్స్ లేని ప్రైవేటు వాహనాలను రోడ్లపై తిప్పితే కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో పరిధిలో ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులు మంగళవారం ఇబ్రహీంపట్నంలో ప్రైవేటు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 40వాహనాలను తనిఖీ చేయగా ఎలాంటి అనుమతులు లేని 10వాహనాలను సీజ్చేసి ఇబ్రహీంపట్నం డిపోకు తరలించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం డీఎం బాబునాయక్ మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా అర్హత లేని డ్రైవర్లు ప్రైవేటు వాహనాలను కెపాసిటికి మించి ఎక్కించుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇకపై అనుమతులు లేకుండా రోడ్లపై వచ్చే ప్రైవేటు వాహనాలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీజ్ చేయనున్నట్లు తెలిపారు.
మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో 10 ప్రైవేటు వాహనాలను సీజ్ చేశామన్నారు. ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఓవైపు ప్రత్యేకంగా కృషి చేస్తుంటే ప్రైవేటు వాహనదారులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఆర్టీఏ అధికారులు బలరాం, మల్లికార్జున్రెడ్డి, ఆర్టీసీ అధికారులు బాపురావు, పురుషోతమ్తో పాటు ఆర్టీసీ, ఆర్టీఏ కానిస్టేబుల్లు పాల్గొన్నారు.