షాబాద్, ఏప్రిల్ 12: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించి సి-సెక్షన్(సిజేరియన్) ప్రసవాలను తగ్గించాలని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో జిల్లాలోని గైనకాలజిస్టులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సిజేరియన్లతో మహిళల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పెరిగి వారికి అనారోగ్య సమస్యలు కలుగుతున్నట్లు చెప్పారు. గైనాకాలజిస్టులు కచ్చితంగా సాధారణ ప్రసవాలు చేయడానికి తగిన శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినట్లు చెప్పారు. ఇక నుంచి సిజేరియన్లపై ప్రతి నెలా క్షుణ్ణంగా ఆడిట్ చేయడం జరుగుతుందని తెలిపారు. సిజేరియన్లు చేసినట్లు ఫిర్యాదులు వస్తే, ఆడిట్లో నిర్ధారణ అయితే అలాంటి వైద్యులపై చట్టపరమైన చర్యలతోపాటు, దవాఖాన లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
సాధారణ ప్రసవాలు చేసేందుకు అనుసరించాల్సిన నైపుణ్యాల గురించి డాక్టర్ ఫెర్నాండెజ్ వైద్యులకు వివరించారు. రాష్ట్రస్థాయిలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడానికి అన్ని చర్యలు తీసుకుని, ప్రభుత్వ ఆదేశాలను అమలుపరుస్తున్నట్లు కుటుంబ సంక్షేమశాఖ సంయుక్త(జేడీ)సంచాలకులు డాక్టర్ పద్మజ తెలిపారు. ఏఐజీ దవాఖాన వ్యవస్థాపకుడు డాక్టర్ నాగేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. వైద్యులకు/గైనకాలజిస్టులకు ప్రస్తుత పరిస్థితులు, వైద్యపరమైన మార్గదర్శకాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ గైనకాలజిస్టులు, రిటైర్డ్ వైద్యులు, డిప్యూటీ జిల్లా వైద్యాధికారులు, ఆరోగ్య విభాగ సిబ్బంది పాల్గొని అవగాహన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమని రాష్ట్ర అధికారుల బృందం ప్రశంసించింది. రంగారెడ్డిజిల్లా కార్యక్రమాలు ఇతర జిల్లాల ఆరోగ్య అధికారులకు మార్గదర్శకం కావాలని ఆశించారు.