రంగారెడ్డి, జూలై 21, (నమస్తే తెలంగాణ) : మోదీ ప్రభుత్వ హయాంలో సామాన్యులు బతకడం కష్టతరంగా మారింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచిన కేంద్రం, పేదలకు పాలు, పాల ఉత్పత్తులను కూడా దూరం చేసేలా నిర్ణయాలు తీసుకుంది. పేదల కడుపు కొడుతూ కేవలం సంపన్న వర్గాలకు మాత్రమే మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాలు, పెరుగు, మజ్జిగ, లస్సీ, బియ్యం తదితరాలపై జీఎస్టీ విధించడంపై జిల్లావ్యాప్తంగా నిరసనలు చేశారు. గతంలో ఎన్నడూలేని విధంగా పాలు, పాల ఉత్పత్తులపై కూడా జీఎస్జీ విధించడం ఇదే తొలిసారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదనే విధంగా ప్రస్తుత పరిస్థితులు తయారయ్యాయని మధ్యతరగతి గృహిణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నిత్యావసర సరుకులు కొనుగోలు చేయలేని పరిస్థితులు దాపురించాయని గృహిణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎలా బతకాలి : మల్లేశ్, రైతు, విఠ్యాల
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో నిత్యావసరాల సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరల పాలు, ఆహార ధాన్యాలు, ప్యాకింగ్ చేసిన మజ్టిగ, లస్సీ తదితర వాటిపై జీఎస్టీ విధించడం సరికాదు. ఇలాగైతే ఎలా బతకాలి. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీకి ఓటుతో సమాధానమివ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
పేదోళ్ల నడ్డి విరుస్తున్నది
– రావుల జయలక్ష్మి, గృహిణి, పెద్దఅంబర్పేట
మోదీ నాయకత్వంలోని కేంద్రం పేదోళ్ల నడ్డివిరుస్తున్నది. పెద్దోళ్లకు దోచిపెడుతూ.. సామాన్యులపై భారం మోపుతున్నది. పన్నులు పెంచడంలో పాలు, పెరుగును కూడా విడువకపోవడం సిగ్గుచేటు. నిరుపేదలు వంటింటి సామాన్లు కొనాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వస్తున్నది.
గాలిపై కూడా పన్ను కట్టాల్సి వస్తుందేమో..!
– లక్ష్మి, చిరుద్యోగి, శంకర్పల్లి
కేంద్ర ప్రభుత్వం ఇష్టారీతిన పన్నులను పెంచుకుంటూపోతే మధ్య తరగతి ప్రజలు ఎలా బతకాలి. పసిపిల్లలు తాగే పాలపై, పప్పు, ఉప్పుపై జీఎస్టీలు విధిస్తే సామాన్యుడి బతుకు ప్రశ్నార్థకంగా మారుతుంది. భవిష్యత్తులో పీల్చే గాలిపై కూడా పన్ను కట్టాల్సి వస్తుందేమో..! కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.
సామాన్యులు, పేదలపై భారం
– కె.స్వర్ణలత, ఈర్లపల్లి, చేవెళ్ల మండలం
కార్పొరేట్లకు భారం తగ్గించి పేదలపై వడ్డింపు సరి కాదు. ఏం తినేటట్లు, కొనేటట్లు లేని పరిస్థితి నెలకొన్నది. సగటు మనిషి జీవితం గడవాలంటేనే కష్టంగా ఉన్నది. వస్తు సేవల పన్ను సగటు మనిషి ఉసురు తీస్తున్నది.
జీఎస్టీతో బడుగు, బలహీన వర్గాలకే నష్టం
– ముకుందంగౌడ్, చేవెళ్ల
మోదీ ప్రభుత్వం వేస్తున్న జీఎస్టీతో బడుగు, బలహీన వర్గాలే ఎక్కువగా నష్టపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బతికే బడుగుల జీవితాలు చిన్నాభిన్నమౌతాయి. కేంద్ర ప్రభుత్వం మరీ కర్కశంగా వ్యవహరిస్తున్నది. యువత, మహిళలు బీజేపీకి తగిన శాస్తి చేస్తారు.
పేదలకు తీవ్ర ఇబ్బందులు
– పెబ్బె శ్రీశైలం, చేగూరు
కేంద్ర ప్రభుత్వం పేదలపై భారీ మొత్తంలో భారాన్ని మోపుతున్నది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇది చాలదన్నట్లు పాల ఉత్పత్తులపై కూడా జీఎస్టీ విధించింది. ఇక బీజేపీ ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశం. ప్రజలు తగిన బుద్ధి చెపుతారు.
పాలపై జీఎస్టీ ఎంతవరకు సమంజసం
– చంద్రశేఖర్, పాడి రైతు, విఠ్యాల
కేంద్ర ప్రభుత్వం పాలపై జీఎస్టీ విధించడం సరికాదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో పేద మధ్య తరగతి కుటుంబాలు ఏమీ కొనలేని పరిస్థితి దాపురించింది. సంపన్నుల కోసం పని చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం గద్దె దిగాలి.పప్పులు ఉడుకుడే కష్టమైంది : సుక్క మాధవి, గృహిణి, తట్టిఅన్నారం, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ ఏ నిత్యావసర వస్తువును వదలకుండా పన్నుల భారం మోపుతున్న మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటికి పంపే రోజులు దగ్గరపడ్డాయి. అందుకే కేంద్రం పేదలపై ఎగిసెగిసి పడుతున్నది. ఇంట్లో పప్పులు ఉడకడమే కష్టమన్నట్టు తయారవుతున్నది. కేంద్రం వందల కోట్లు ఉన్నోళ్లకు మరింత కట్టబెడుతూ లేనోళ్లపై ప్రతాపం చూపుతున్నది.
గిట్లయితే బతుకుడెట్లా? : పాశం ఆకాంక్ష, గృహిణి, ఇబ్రహీంపట్నం మోదీ సర్కారు గిట్ల నిత్యావసరాలపై పన్నులు పెంచుకుంటూ పోతే సామాన్యుడు బతుకుడెట్లా? పాలు, పెరుగు, పప్పులను కూడా వదిలిపెట్టకుండా పన్నులు పెంచడం దారుణం. పెద్దోళ్లకు ఎడాపెడా దోచిపెడుతున్న మోదీ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టే. పాలు మొదలు సిలిండర్ దాకా ధరలు పెంచుతున్న కేంద్రానికి రోజులు దగ్గరపడ్డాయి.