ఆమనగల్లు, ఆగస్టు 10 : ఆమనగల్లు మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ కార్యాలయ భవనంలో బుధవారం ఎంపీపీ అనిత అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, కల్వకుర్తి ఎమ్మెల్మే జైపాల్యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే చెన్నంపల్లి సర్పంచ్ శ్రీనయ్య మాట్లాడుతూ.. చెన్నంపల్లి, పోలెపల్లి గ్రామ శివారులో 70 ఎకరాల్లో ఓ సంస్థ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ ఏర్పాటు చేస్తున్నారని సభలో ప్రస్తావించారు. గ్రామపంచాయతీకి రావాల్సిన 10 శాతం భూమి కేటాయించకుండా వెంచర్ ఏర్పాటు చేస్తున్నారని సభ దృష్టికి తెచ్చారు. ఇదే విషయమై అధికారులకు తెలిపినా స్పందించడంలేదన్నారు. స్పందించిన ఎమ్మెల్యే చెన్నంపల్లి, పోలెపల్లి శివారులో నిర్మిస్తున్న వెంచర్పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ను ఫోన్ ద్వారా ఆదేశించారు.
ఆయా గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని, చిన్నచిన్న పనులకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని సర్పంచ్లు శ్రీనయ్య, అంబర్సింగ్ విద్యుత్ శాఖ ఏఈ సీతారాములును సభలో నిలదీశారు. ఇకనుంచి విద్యుత్ సమస్యలు తలెత్తకుండ, డబ్బులు వసూలు చేస్తున్నవారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఏఈ తెలిపారు.
శంకర్కొండ- మేడిగడ్డ తండాల మధ్య ఉన్న కత్వా వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.3.10 కోట్లు నిధులు మంజూరైనా నేటికి పనులు చేపట్టడంలేదని, కురుస్తున్న వర్షాలకు పెద్దఎత్తున వాగు పారుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయని.. వంతెన నిర్మాణం త్వరగా చేపట్టాలని సర్పంచ్ అమర్ సింగ్ కోరారు. స్పందించిన ఎమ్మెల్యే వర్షాలు తగ్గుముఖం పట్టగానే పనులను ప్రారంభించాలని పంచాయతీ డీఈ తిరుపతిరెడ్డిని ఆదేశించారు.
ఎంపీ రాములు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధుల సహకారంతో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మూడు నెలలకోసారి జరిగే మండల సమావేశాలకు విద్యుత్ శాఖ ఏడీఈ, మిషన్ భగీరథ డీఈ, డీఎల్పీవో, అధికారులు రాకపోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సమావేశాలకు రాకుంటే ప్రజల సమస్యలు ఎలా పరిష్కారరమవుతాయని ఆయన పేర్కొన్నారు. అధికారులు సమావేశాలకు హాజరు కాకుంటే శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని సభలో తీర్మానం చేశారు. సమావేశంలో జడ్పీటీసీ అనురాధ, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ గిరియాదవ్, ఎంపీడీవో వెంకట్రాములు, తహసీల్దార్ పాండునాయక్, ఇన్చార్జి ఎంఈవో సర్దార్నాయక్, ఏవో అరుణకుమారి, సీడీపీవో సక్కుబాయి, ఏఈలు కృష్ణయ్య, వాగ్దేవి, శరత్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమనగల్లులో పలుచోట్ల జడ్పీటీసీ అనురాధ, ఎంపీపీ అనిత, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ గిరియాదవ్లతో కలిసి ఎంపీ, ఎమ్మెల్యే మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకట్రాములు, తహసీల్దార్ పాండునాయక్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.