బొంరాస్పేట, ఆగస్టు 3 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం, బడి మానేయకుండా సామాజిక సమ భావనను పెంపొందించడానికి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నది. లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం కొన్నేండ్లుగా మధ్యాహ్న భోజనం పెడుతున్నది. వారానికి మూడు రోజులు గుడ్డు ఇస్తున్నారు. వంటలు చేయడానికి ప్రతి పాఠశాలలో ఏజెన్సీలను నియమించారు. ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా, పకడ్బందీగా అమలు చేయడానికి, బిల్లుల చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించడానికి ఈ నెల నుంచి మధ్యాహ్న భోజన పథకం యాప్ను(ఎండీఎం) అమల్లోకి తెచ్చి ఇటీవల కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పెంచడానికి ప్రతి పాఠశాలలో గోడలపై ఆహార పట్టికను(మెను) రాయించాలని ఆదేశించింది. వారంలో మూడుసార్లు ఉడికించిన గుడ్డును విద్యార్థులకు అందించేలా ఏజన్సీల నుంచి రాత పూర్వకంగా ఒప్పంద పత్రాలను తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రధానోపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయుడు భోజనాన్ని రుచి చూశాకే విద్యార్థులకు వడ్డించాలని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొన్నది.
యాప్లో నమోదు చేయాలి..
పాఠశాల హెచ్ఎం లేదా ఉపాధ్యాయుడు నిత్యం ఎండీఎం యాప్లో ఉదయం 12 గంటల కంటే ముందే విద్యార్థుల సంఖ్య, వారికి అందించే గుడ్లు తదితర వివరాలను నమోదు చేయాలి. సాంకేతిక కారణాలతో యాప్లో వివరాలు నమోదు కాకపోతే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలి. హాజరు పట్టికలోని విద్యార్థుల పేర్లు యాప్లో లేకపోతే వెంటనే నమోదు చేయాలి. ఎందుకంటే విద్యార్థుల ఎన్రోల్మెంట్ను నమోదు చేసిన చైల్డ్ఇన్ఫో ఎండీఎం యాప్కు అనుసంధానం చేశారు. చైల్డ్ ఇన్ఫోలో ఉన్న విద్యార్థుల సంఖ్యనే ఎండీఎం యాప్ తీసుకుంటుంది. ఎండీఎం యాప్లో నమోదు చేసే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగానే బిల్లులు జనరేట్ అవుతాయి.
నేరుగా ఖాతాల్లో బిల్లులు..
మధ్యాహ్న భోజనం వండి పెట్టడానికి కార్మికులు అప్పులు చేసేవారు. ఈ విధానంతో వారి ఇబ్బందులు తొలిగిపోతాయి. ఏజెన్సీల బిల్లులతో పాటు కార్మికుల గౌరవ వేతనాలు సకాలంలో అందనున్నాయి. పాత విధానంలో నెల రోజుల బిల్లును ఎంఆర్సీలో తయారు చేసి దానిని ట్రెజరీకి పంపిస్తే అవి పాస్ అయిన తరువాత బిల్లులు వచ్చేవి. ఈ విద్యా సంవత్సరం నుంచి ట్రెజరీతో సంబంధం లేకుండా ఏజెన్సీలు, కార్మికుల ఖాతాల్లోకే నేరుగా బిల్లులు జమ చేయనున్నారు. నెల అయిపోగానే ఎండీఎం యాప్లో నమోదు చేసిన వివరాల ఆధారంగా బిల్ క్రియేట్ అవుతుంది. దానిని హెచ్ఎం సబ్మిట్ చేస్తే ఎంఈవోకు చేరుతుంది. ఎంఈవో దానిని పరిశీలించి ఓకే చేయగానే బిల్లులు జమవుతాయి. ఈ విధానంతో బిల్లుల ప్రక్రియ ఎవరి వద్ద ఆగిందనే వివరాలను పబ్లిక్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టం(పీఎఫ్ఎంఎస్) ద్వారా తెలుసుకోవచ్చు. బిల్లులు సకాలంలో అందితే నిర్వాహకులు కూడా భోజనం నాణ్యత ప్రమాణాలను పాటించే అవకాశం ఉన్నది.
జిల్లాలో 1036 పాఠశాలలు,93151 మంది విద్యార్థులు..
వికారాబాద్ జిల్లాలో మొత్తం 1036 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 745 ప్రాథమిక, 116 ప్రాథమికోన్నత, 175 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 154 పాఠశాలల్లో అక్షయపాత్ర ఫౌండేషన్ మధ్యాహ్న భోజనాన్ని అందిస్తుండగా మిగతా 882 పాఠశాలల్లో ఏజెన్సీ నిర్వాహకులు(1646 మంది కార్మికులు) వండి పెడుతున్నారు. 93,151 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ప్రతి రోజూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. దాదాపు 95 శాతం విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారు.
యాప్లో నమోదు చేస్తున్నాం..
కొత్తగా అమలులోకి తెచ్చిన ఎండీఎం యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో రోజూ పాఠశాలకు ఎంత మంది విద్యార్థులు వస్తున్నారు, ఎంత మంది మధ్యాహ్న భోజనం తింటున్నారు అనే వివరాలను నమోదు చేస్తున్నాం.
– నెహ్రూచౌహాన్, దుద్యాల ఉన్నత పాఠశాల హెచ్ఎం
99 శాతం యాప్ డౌన్లోడ్..
జిల్లాలో ఎండీఎం యాప్ను 99 శాతం ప్రధానోపాధ్యాయులు డౌన్లోడ్ చేసుకున్నారు. రోజూ ఎంతమంది పాఠశాలకు వస్తున్నారు, ఎంతమంది భోజనం తింటున్నారు, ఎంతమంది పని చేస్తున్నారో యాప్లో నమోదవుతున్నది. వంట ఏజెన్సీలకు బకాయి బిల్లులు చెల్లిస్తాం. వచ్చిన బడ్జెట్తో గత సంవత్సరం బిల్లులు క్లియర్ చేస్తాం.
– రేణుకాదేవి, డీఈవో