రంగారెడ్డి, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ‘కాశ్మీర్ యాపిల్ బేర్’ పండు చూడటానికి గంగరేగు పండును పోలి ఉంటుంది. కానీ అది గంగరేగు కాదు. యాపిల్ను పోలి ఉంటుంది. అయినా అది యాపిల్ కాదు. పై రెండింటినీ పోలినట్టుండే ‘కాశ్మీర్ యాపిల్ బేర్’ అది. తినగానే చాలా మధురంగా ఉంటుంది. ఈ ‘బేర్’ పంటను సాగు చేసే రైతులు జిల్లాకు ఒకరు లేక అసలు ఉండకపోవచ్చు. ఎందుకంటే, ఈ పంట సాగుపై రైతుల్లో అవగాహన తక్కువ. సాగు చేస్తే దిగుబడి వస్తుందో? రాదో? ఒక వేళ వచ్చినా తగిన డిమాండ్ ఉంటుందో..? లేదో…? అన్న సందేహాలే అధికంగా ఉంటాయి. సంప్రదాయ సాగుకు భిన్నంగా వ్యవహరించే వాళ్లు మాత్రమే ఇలాంటి పంటలపై ఆసక్తి చూపుతూ కష్టాన్ని ఇష్టంగా చేసుకొని, నాలుగు రూపాయలు వెచ్చించి అయినా సఫలమవుతుంటారు. ఈ పండ్లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. రేగు పండు తిన్న మరు క్షణం నుంచే నోటికి ఏదో జిగురు పదార్థం అంటుకున్న భావన చాలా సేపటి దాకా కలుగుతుంది. ఈ పండ్ల సాగును రంగారెడ్డి జిల్లా, తుక్కుగూడ (హైదరాబాద్ నగర శివారు) పరిధిలోని ఇమాంగూడ గ్రామానికి చెందిన బక్కారం బుచ్చిరెడ్డి అనే రైతు మొట్టమొదటి సారిగా సాగు చేశారు. ఇప్పటికే రెండు విడుతలుగా కాతను కోశారు.
బక్కారం బుచ్చిరెడ్డి హైదరాబాద్ నగర శివారులోని (తుక్కుగూడ) ఇమాంగూడ వాసి. పదో తరగతి వరకే చదువుకున్న రైతు. బుచ్చిరెడ్డి తనకున్న భూమిలో సంప్రదాయ పంటలను కాకుండా ఆరుతడి పంటలను వేసి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని తపించేవారు. ఈ నేపథ్యంలో ఒకరోజు యూ ట్యూబ్లో ‘కాశ్మీర్ యాపిల్ బేర్’ పంట సాగు గురించి భద్రాచలవాసి రాజు సాగు చేసిన విధానాన్ని చూశారు. చూసిందే తడవుగా రాజు గురించి తెలుసుకొని, తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి ఆ పంట సాగు వివరాలను తెలుసుకొని బుచ్చిరెడ్డి సైతం సాగు చేసేందుకు సన్నద్ధమయ్యారు. రాజు సహాయంతో ఒక్కో మొక్కకు రూ.150 చొప్పున 1500 మొక్కలను బంగ్లాదేశ్ నుంచి తెప్పించారు. తనకు ఉన్న మూడెకరాల్లో ఒక ప్రణాళిక ప్రకారం, ‘బేర్’ పంటను సాగు చేయడం మొదలు పెట్టారు. ఇందుకు దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు అయినట్టు చెబుతున్నారు.
మూడెకరాల పంట సాగుకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా, కోతులు, గబ్బిలాలు, పిట్టలు రాకుండా కట్టుదిట్టంగా జాలీతో కూడిన ఫెన్సింగ్ను ఏర్పాటు చేశారు. ప్రతి మొక్కకూ పటిష్టమైన ఒక వెదురు బొంగు, డ్రిప్ ఇరిగేషన్ ఉండేలా ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మూడెకరాలకు సరిపోయేలా 1350 మొక్కలను నాటారు. వీటి సాగుకు గింజలున్నప్పటికీ, గింజలతో కూడిన సేద్యం సరిగా రాదని, ‘వై’ ఆకృతిలో ఉన్న మొక్క అంటులనే సాగుకు వినియోగిస్తున్నారు. సాధారణంగా గింజలతో కూడిన సాగు కూడా ఉంటుంది. కాని, వ్యవసాయం ఆధునిక పోకడలో భాగంగా క్లోనింగ్ ద్వారానే పంటల అధిక దిగుబడి, ఉత్పత్తి తీసుకురావొచ్చని వ్యవసాయదారులు, శాస్త్రవేత్తల ప్రగాఢ విశ్వాసం.
బుచ్చిరెడ్డి 1350 మొక్కలను మూడెకరాల్లో నాటారు. అయితే, గత ఫిబ్రవరి మాసాంతంలో పంట సాగును ఆరంభించారు. తొలుత ఎదుగుతున్న మొక్కలకు చీడ, పురుగు ఆవరించడంతో తెలిసిన మందులెల్లా వాడి డబ్బులు పోగొట్టుకున్నారు. కానీ, మొక్కను ఆవరించిన పురుగు మాత్రం పోలేదు. అయితే, ఇప్పటికే సాగు చేస్తున్న వారి సలహాలు, జిల్లా ఉద్యాన వన శాఖ అధికారుల సలహాలను తీసుకొని సేంద్రియ పద్ధతిలో పురుగు, చీడలకు చెక్ పెట్టారు. గో మూత్రం, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డతో పాటు పొగాకు మిశ్రమాన్ని కలిపి, మరిగించి, ప్రతి 200 లీటర్ల నీటికి 12 లీటర్ల ఈ ద్రావణాన్ని పిచికారీ చేశారు. దీంతో మొక్కలను ఆవరించి ఉన్న పురుగు, చీడల పీడ విరగడయ్యింది. మొక్క ఎదుగుదల పదిహేను ఫీట్లను మించిపోయే అవకాశం ఉంది. అయితే, ఐదు నుంచి ఆరు ఫీట్ల వరకు రాగానే మొక్క ఎదిగే జుట్టును కత్తిరించాలని చెబుతున్నారు. అలా చేస్తేనే మొక్క మనకు అందుబాటులోకి వస్తున్నదని, పంటను కోయడానికి వీలవుతున్నదని అంటున్నారు.
మొక్క నాటిన నాలుగు నెలల నుంచే కాతకు వస్తుంది. అయితే, నాటిన ప్రతి మొక్క 20 కేజీల పైనే దిగుబడి ఇస్తుంది. ఇప్పటికే బుచ్చిరెడ్డి రెండు విడుతలుగా కాతను కోసినట్టు తెలిపారు. ఒక ఎకరాకు తొమ్మిది నుంచి పది టన్నుల మేర దిగుబడి వస్తుంది చెబుతున్నారు. అయితే, ఈ ‘బేర్’ ధర మార్కెట్లో రూ.32 నుంచి రూ.100 వరకు అమ్ముడవుతున్నదని చెబుతున్నారు. పంటను ప్రస్తుతం పహాడిషరీఫ్ మార్కెట్కు తరలిస్తున్నట్టు తెలిపారు. కాగా, మార్కెట్లో రూ.30 వరకు అమ్మకం జరుగుతుందని పేర్కొంటున్నారు. నిత్యం సాగు చేసే వరి, వేరు శనగ లాంటి పంటల వల్ల శ్రమ అధికం, దిగుబడి రాకపోగా, వచ్చిన దిగుబడికి ధరలు ఉండవని చెబుతున్నారు.
ఈ పంట సాగు కోసం జిల్లా స్థాయి ఉద్యాన అధికారులు, ఇతర జిల్లాల రైతులను కూడా కలిశా. ఇందుకు పలువురి సలహాలు, సూచనలు తీసుకున్నా. భద్రాచలంలో రాజు అనే రైతు సహాయంతో ప్రస్తుతం ఈ పంటను సాగు చేయగలుగుతున్నా. ఆ మిత్రుడి ద్వారానే బంగ్లాదేశ్ నుంచి 1500 మొక్కలను తెప్పించా. 1350 మొక్కలను మూడెకరాల్లో నాటాను. మిగతా 150 మొక్కలను స్థానికంగా నా మిత్రులకు పంచాను. పంట సాగు మొదట్లో కాస్త ఇబ్బందులు ఎదురైనా.. వాటన్నింటినీ అధిగమించా. ఇప్పటికే రెండు దఫాలుగా పంటను మార్కెట్కు తరలించా. ఈ పంట సాగుకు రూ.5 లక్షల వరకు ఖర్చు అయ్యింది.
– బక్కారం బుచ్చిరెడ్డి, రైతు, (తుక్కుగూడ) ఇమాంగూడ