రంగారెడ్డి, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈవీఎంలు, వీవీ ప్యాట్ల మొదటి విడుత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శశాంక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ ఈవీఎం గొడౌన్స్ లో ఈ ప్రక్రియను నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు కేటాయించాల్సి ఉన్న కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను స్క్రీన్పై కలెక్టర్ శశాంక రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఈ ర్యాండమైజేషన్ జాబితా ఆధారంగానే జిల్లాలోని ఎల్బీనగర్, మహేశ్వరం, షాద్నగర్, చేవేళ్ల, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, కల్వకుర్తి శాసన సభ నియోజకవర్గాలకు కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లు కేటాయించామని తెలిపారు. ఆయా సెగ్మెంట్లలో స్ట్రాంగ్ రూముల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ వా టిని భద్రపరుస్తామన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో 713 బీయూ, సీయూలు, 799 వీవీ ప్యాట్లు, మహేశ్వరం పరిధిలో 671 బీయూ, సీయూలు, 751 వీవీప్యాట్లు, రాజేంద్రనగర్లో 678 బీయూ, సీయూలు, 760 వీవీ ప్యాట్లు, శేరిలింగంపల్లిలో 791 బీయూ, సీయూలు, 886 వీవీ ప్యాటు,్ల చేవెళ్లలో 372 బీయూ, సీయూలు, 417 వీవీ ప్యాట్లు , షాద్నగర్లో 328 బీయూ, సీయూలు, 379 వీవీ ప్యాట్లు, కల్వకుర్తిలో 338 బీయూ, సీయూలు, 379 వీవీ ప్యాట్లు, ఇబ్రహీంపట్నంలో 428 బీయూ, సీయూలు, 480 వీవీ ప్యాట్లు ర్యాండమైజేషన్ జాబితా ప్రకారం కేటాయించామన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలను తు.చ తప్పకుండ పాటిస్తూ, పూర్తి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియను చేపడుతున్నామని, తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.