తాండూరు : వికారాబాద్ జిల్లాలోని పేరుగాంచిన ఏకాంబర రామలింగేశ్వరాలయానికి చారిత్రాత్మక ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ ఆలయం బషీరాబాద్ మండలం నీళ్లపల్లి అటవీ ప్రాంతంలో చక్కటి శిల్పకళతో త్రేతాయుగంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ ఆలయం నాలుగు వందల గజాల విస్తీర్ణంలో ఉన్న చతురస్రాకారపు కోనేరు మధ్యలో వెలసింది. త్రేతాయుగంలో రావణబ్రాహ్మణ సంహార అనంతరం కోటి శివలింగాల స్థాపనలో భాగంగా శ్రీరాముడు ఇక్కడి ఆలయంలో శివలింగాన్ని స్థాపించాడని తెలిపే గాథ ప్రాచుర్యంలో ఉంది. బ్రాహ్మణ హత్య పథకం నుంచి విముక్తికి గాను సప్త బుషుల సలహా మేరకు శ్రీరాముడు అతి పవిత్రమైన స్థలంగా ఎంచుకొని ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.
ప్రతి సంవత్సరం శ్రావణమాసం చివరి వారంలో నాలుగు రోజులు ఆదివారం నుంచి బుధవారం వరకు జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతరలో భాగంగా మొదటి రోజైన ఆదివారం ఉదయం నాలుగు గంటలకు ఆలయ సమీపంలోని నీళ్లపల్లి గ్రామం నుంచి దేవాలయం వరకు ఊరేగింపుగా స్వామి పల్లకీ సేవా-గంధాలు, సోమవారం రథోత్సవం, మంగళవారం లంకాదహనం కార్యక్రమాలు, బుధవారం జాతర ఉత్సవ ముగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో హిందువులు, ముస్లింలు ఇతర మతస్తులు పాల్గొనడం విశేషం.
జాతరకు పోలీస్ బందోబస్తు..
జాతరకు తరలి వచ్చే వేలాది మంది భక్తులకు ఆలయకమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. భక్తులు కొవిడ్ నియమాలు పాటిస్తూ జాతరలో పాల్గొనాలని నిర్వాహకులు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా తాండూరు ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ మేనేజర్ రాజశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.