కొడంగల్, డిసెంబర్ 7 : పెండింగ్ కేసులు లేకుండా, ప్రతి కేసులో నేరస్తులు శిక్షింపబడేలా అన్నింటా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పోలీసు సిబ్బందికి సూచనలు, సలహాలను అందించారు. బుధవారం కొడంగల్ పోలీస్స్టేషన్, సర్కిల్ పరిధిలోని రికార్డులను, స్టేషన్ పరిధిలోని అన్ని విభాగాలను తనిఖీ చేసి సిబ్బందితో నేర సమీక్షా కార్యక్రమాన్ని నిర్వహించి కేసుల వివరాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసులకు సంబంధించి ఎటువంటి ఫైల్ పెండింగ్లో ఉండవద్దని.. ప్రతి కేసులోని నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ నిర్వహించాలని.. నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవద్దని తెలియజేశారు. ఇప్పటివరకు కేసుల ఛేదనలో మంచి ప్రతిభ ప్రదర్శన కనబరిచారని.. ఇక ముందు కూడా ఇటువంటి చురుకుదనాన్ని కనబరచి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావడంతో పాటు పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలని సూచించారు. ప్రజలకు పోలీసులు మరింత చేరువ కావాలని అధికారులకు సూచనలు చేశారు.
పోలీసు శాఖలో అమలుపరుస్తున్న వర్టికల్స్ను సమర్థవంతంగా అమలు చేయాలని, సిబ్బందికి కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూర్చాలని పేర్కొన్నారు. సిబ్బంది సమస్యలను తెలుసుకొని, సమస్యలు ఉంటే అధికారులకు తెలపాలని.. లేదంటే నేరుగా సంప్రదించాలని తెలిపారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండాలని.. అవసరమైన సమయంలో ఉపయోగించాలని సూచించారు.
ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక విషయాలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి నేరాలు జరుగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని, దానికి అనుగుణంగా పెట్రోలింగ నిర్వహించాలని పేర్కొన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అక్రమ వ్యాపారాలు చేసే వారిపై గట్టి నిఘా ఉండాలని, సమస్యలు సృష్టించేవారిపై కఠినంగా వ్యవవహరించాలని తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
అక్రమాల నివారణకు అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. జాతీయ రహదారిపై అధిక వేగం కారణంగగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వేగాన్ని కళ్లెం వేసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ మొక్కలు విరివిగా పెంచి జిల్లాకు ఆదర్శంగా నిలుస్తున్నదని సిబ్బందిని అభినంధించారు. ఇదే మాదిరిగా అన్ని పోలీస్స్టేషన్లలో పెద్ద మొత్తంలో మొక్కలు పెంచి పచ్చటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పరిగి డీఎస్పీ కరుణాసాగర్రెడ్డి, కొడంగల్ సీఐ శంకర్, కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ ఎస్ఐలు రవి, నయీం, రమేశ్ పాల్గొన్నారు.