కడ్తాల్ : సమాజంలో ప్రతి ఒక్కరితో ప్రేమ, కరుణతో మెలగాలని, ధ్యానంతో ఒత్తిడిని అధిగమించవచ్చని ది ఇండియన్ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి పత్రీజీ అన్నారు. మండల పరిధిలోని అన్మాస్ పల్లి గ్రామ సమీపంలో గల కైలాసాపురిలోని మహేశ్వర మహా పిరమిడ్లో మహిళాధ్యాన మహాసభలు-3 శనివారం ఐదో రోజుకి చేరుకున్నాయి. ధ్యానంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ధ్యానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యానులనుద్ధేశించి సుభాశ్ పత్రీజీ మాట్లాడుతూ ఎదుటి వారిని ఎవరైతే ప్రేమిస్తారో, వారే నిజమైన దేవుళ్లు అని అన్నారు. జీవ హింసా మహా పాపమని, ఏ జీవిని కూడా హింసించకూడదని తెలిపారు.
హింసలేని ప్రపంచాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రతి మనిషి నిత్య విద్యార్థిని అని, మనం తెలుసుకోవాల్సింది చాలా ఉన్నదని చెప్పారు. జీసెస్ ఈ ప్రపంచానికి కరుణ, ప్రేమ, శాంతి సందేశాలు అందజేశారన్నారు. నిత్యం ధాన్యం సాధన ద్వారా మానసిక ప్రశాంతత పొందడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయన అన్నారు. ధ్యానంతో ప్రపంచమంతా శాఖహార జగత్తుగా మారుతుందన్నారు. క్రిస్మస్ సందర్భంగా పలువురు పాస్టర్లు జీసెస్ జీవిత చరిత్ర విశేషాలను వివరించారు.
అనంతరం పిరమిడ్ మాస్టర్లు, ఆధ్యాత్మిక గురువులు రచించిన పలు పుస్తకాలను సుభాశ్ పత్రీజీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిరమిడ్ ప్రధాన వేదికపై క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ కోర్పోలు విజయభాస్కర్రెడ్డి, సభ్యులు స్వర్ణమాల, మాధవి, రవిశాస్త్రి, సాగర్ పాల్గొన్నారు.