పెద్దేముల్ : ప్రభుత్వం నిషేధించిన గుట్కా, పాన్ మసాలా, మత్తు పదార్థాలను విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ నాగరాజు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని పలు పాన్షాప్, కిరాణా దుకాణాలపై సిబ్బందితో కలిసి ఆకస్మికంగా మెరుపుదాడులు నిర్వహించారు. పలుషాపుల్లో నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా, పాన్మసాలా ప్యాకెట్లను స్వాదీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాలను ఎవ్వరు కూడా షాపుల్లో విక్రయించడానికి వీలులేదన్నారు. కాదని ఎవరైనా గుట్టుచప్పుడు కాకుండా షాపుల్లో విక్రయిస్తే అలాంటి వారిని గుర్తించి కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
మండల కేంద్రంతో పాటు గ్రామాల్లోని దుకాణాల్లో ఎవరైనా గుట్కాలు, పాన్మసాలాల వంటి నిషేధిత పదార్థాలను విక్రయిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారిపేర్లు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. కాగా సోమవారం మండల కేంద్రంలో పలు పాన్షాప్, కిరాణా దుకాణాలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించగా రెండు పాన్షాపుల్లో, ఒక కిరాణా దుకాణంలో సుమారు 7,270 గుట్కా పాకెట్లు లభించాయని వాటి విలువ సుమారు రూ. 10,800 రూపాయలు ఉంటుందన్నారు. మూడు షాపుల యాజమానులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ నాగరాజు తెలిపారు. దాడుల్లో ఎస్ఐతో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.