వికారాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ‘కడుపుకోత’లు జోరుగా సాగుతున్నాయి. కొన్ని ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలు కాసుల కో సం కక్కుర్తిపడి సిజేరియన్లకు తెగబడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ కాన్పులకు అవకాశమున్నా.. ఏదో ఒక సాకు చెబుతూ అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఒక్కో సీజేరియన్కు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేస్తున్నాయి. జిల్లాలోని ప్రైవేట్ దవాఖానల్లో జరిగే ప్రసవాల్లో దాదాపు 90శాతం ప్రసవాలు ఈ తరహావే ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు రూపొందించిన నివేదిక ద్వారా తెలుస్తున్నది.
అదే సమయంలో ప్రభుత్వ దవాఖానల్లో జరిగే ప్రసవాల్లో కేవలం 20-30శాతం ప్రసవాలు మాత్రమే సిజేరియన్లు జరుగు తుండడం గమనార్హం. జిల్లాలో 50 వరకు ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు ఉన్నాయి. సీటీస్కాన్ సెంటర్లు, ల్యాబ్లు, స్కానింగ్, ఎక్స్రే సెంటర్లు కలిపి 20 వరకు డయాగ్నోస్టిక్ సెంటర్లున్నాయి. చాలా ప్రైవేట్ నర్సింగ్హోంలలో మెడికల్ స్టోర్స్ ఉన్నాయి. వీటిని ఆయా దవాఖానల యాజమాన్యాలే నడిపిస్తున్నాయి. జిల్లాలో చాలావరకు ప్రైవేట్ దవాఖానల్లో గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోని ఆర్ఎంపీ, పీఎంపీలు మధ్యవర్తులుగా పని చేస్తున్నారు. వీరికి విపరీ తమైన పబ్లిసిటీ చేస్తున్నారు. తమ దవాఖానకొస్తే అత్యాధునిక సేవలు అందిస్తామని నమ్మబలుకుతున్నారు. గర్భిణులకు ప్రతినెలా స్కానింగ్లు, పరీక్షలు చేస్తున్నారు.
ప్రైవేట్ దవాఖానలకు వెళ్లిన గర్భిణులకు విచ్చలవిడిగా ఆపరేషన్లు చేస్తున్నట్లు జనం ఆరోపిస్తున్నారు. స్కానింగ్ తీయడం, బిడ్డ అడ్డం తిరిగిందని..రక్తం తక్కువగా ఉందని..పేగులు మెడకు చుట్టుకున్నాయని, ఆపరేషన్ చేయకుంటే తల్లికి బిడ్డకు ప్రమాదం అని రకరకాల కారణాలు చెప్పి రోగులు, వారి బంధువులను భయభ్రాంతులకు గురి చేస్తూ డాక్టర్లు అందినకాడికి దండుకుంటురని విమర్శలున్నాయి. జిల్లాలో ఉన్న ప్రైవేట్ నర్సింగ్ హోమ్లలో గడిచిన మూడు నెలల వ్యవధిలో 669 ప్రసవాలు జరుగగా అందు లో 602 డెలివరీలు శస్త్ర చికిత్సల ద్వారానే జరిగాయి.
ప్రైవేట్ దవాఖానల్లో డెలివరీల ఆపరేషన్ల రేటు 90 శాతంగా ఉండగా.. సాధారణ కాన్పులు కేవలం 10 శాతమే. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు మూడు నెలల్లో కేవలం 67 మాత్రమే. డిసెంబర్లో 241 ప్రసవాలు జరుగగా అందులో సిజేరియన్లు 213.. జనవరిలో 245 డెలివరీల్లో సిజేరియన్లు 221 .. ఫిబ్రవరిలో 183 డెలి వరీలు జరుగగా అందులో సిజేరియన్లు 168 ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ దవాఖానల్లో గత మూడు నెలల్లో 2,241 ప్రసవాలు జరుగగా 788 ప్రసవాలు మాత్రమే సిజేరియన్లు జరిగాయి.
ప్రసవం కోసం ప్రైవేట్ దవాఖానలకెళ్తే బిల్లుల మోత మోగుతున్నది. ఆపరేషన్ అయితే.. ఇన్వెస్టిగేషన్ పేరుతో రూ.4 వేలు, మత్తు మందు వైద్యుడి పేరుతో రూ.2వేల నుంచి రూ.3 వేల వరకు, ఆపరేషన్ మెడిసిన్ పేరిట రూ.4000 నుంచి రూ.5000 వరకు వసూలు చేస్తున్నారు. ఇక దవాఖాన నుంచి తల్లీబిడ్డ బయటికొచ్చే రోజు వరకు బెడ్చార్జి, రూమ్ సర్వీస్, సర్వీస్ చార్జిలు, హాస్పిటల్ మెయింటెనెన్స్, పవర్బిల్ అన్నీ కలిపి రూ.60 వేల నుంచిరూ.80 వేలు సమర్పించు కోవాల్సిందే.
ప్రైవేట్ దవాఖానల్లో సాధారణ ప్రసవాల శాతం చాలా తక్కువగా ఉన్నప్పటికీ బిల్లుల వసూలు మాత్రం తగ్గడం లేదు. సాధారణ ప్రసవం అయ్యే గర్భిణులకు ఇన్వెస్టిగేషన్ పేరుతో రూ.5వేలు, మెడిసిన్ చార్జిలు రూ.3వేలు, ఇతరత్రా ఖర్చులు రూ.5 వేలు, మెయింటెనెన్స్, రూమ్ సర్వీసు, బెడ్చార్జి, ఇతర ఖర్చులు కలుపుకొని రూ.30వేలు బిల్లు చెల్లించాల్సిందే. దీంతో ఎంత దోపిడీ జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్తో పోల్చితే ప్రభుత్వ దవాఖానల్లోనే సాధారణ ప్రసవాల రేటు అత్యధికంగా ఉన్నది.
జిల్లాలోని ప్రైవేట్ దవాఖానలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని గర్భిణులు ప్రసవాల కోసం ప్రైవేట్ దవాఖానలకు వెళ్లకుండా సర్కారు ఆస్పత్రులకు వెళ్లేలా అవగాహన కల్పిస్తున్నాం. గతంతో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగింది.
-డా.పల్వన్కుమార్, వికారాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి