ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 7 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నంలో అన్నిశాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న వేసవిలో గ్రామాల్లో ఎలాంటి తాగునీటి ఎద్దడి రాకుండా ముందు జాగ్రత్తగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. పెరుగుతున్న జనాభాకనుగుణంగా ఎంతనీరు అవసరముందో ముందుగానే గుర్తించాలని, ఈ మేరకు వాటర్గ్రిడ్ అధికారులతో మాట్లాడి అవసరమైన విధంగా తాగునీరు తీసుకువచ్చేందుకు కృషిచేస్తామన్నారు. వేసవిలో లోవోల్టేజీ సమస్య రాకుండా విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. లోవోల్టేజీ సమస్య ఉన్న గ్రామాల్లో అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సానిటైజేషన్ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్లు ప్రజలు, రాజకీయ నాయకులను సమన్వయం చేసుకుని ఈ మిషన్ను పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడకూడా గ్రామాల్లో పరిశుభ్రత పాటించకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛమైన వాతావరణంలో విద్యార్థులు విద్యనభ్యసించేందు కోసం పాఠశాలలను రిపేరింగ్ చేయించటంతో పాటు భవనాలకు రంగులు వేయించేందుకు అధికారులు నివేదిక తయారు చేయాలని కోరారు. గ్రామాల్లో ప్రభు త్వం ప్రవేశపెట్టిన శానిటైజేషన్ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు బహుమతులు అందజేస్తామన్నారు.
గంజాయిపై ఉక్కుపాదం
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గంజాయికి ఆస్కారం లేకుండా పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందుకెళ్లాలన్నారు. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ఇంజినీరింగ్ కళాశాలలు అధికంగా ఉన్నందున, ఈ కళాశాలలు, ప్రైవేటు హాస్టళ్ల వద్ద గంజాయి విక్రయించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గంజాయి స్మగ్లింగ్పై అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్శాఖ ఈ విషయంపై కఠినంగా వ్యవహరించి ఇబ్రహీంపట్నం ప్రాంతంలో గంజాయికి ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీలు కృపేశ్, నర్మద, ఉపాధిహామీ అడిషనల్ పీడీ నీరజ, ఎంపీడీవోలు విజయలక్ష్మి, శ్రీనివాస్, వెంకటమ్మ, తహసీల్దార్లు అన్వర్, సాగర్, శ్రీకాంత్రెడ్డి, ఏవోలు వరప్రసాద్, సందీప్, జ్యోతిశ్రీతో పాటు ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి
తుర్కయంజాల్ : తుర్కయంజాల్ మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని 7, 8, 9, 10, 20 వార్డుల్లో రూ.3.18 లక్షలతో సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశల వారీగా సమస్యలను పరిష్కరించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తామని తెలిపారు. అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలన్నారు. అనంతరం వివిధ కాలనీ వాసులు తమ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ, వైస్ చైర్పర్సన్ హరిత, మున్సిపాలిటీ కమిషనర్ శ్రీకాంత్, కౌన్సిలర్లు మర్రి మాధవి, కుంట ఉదయశ్రీ, రెవెల్లి హరిత, కొత్తకుర్మ మంగమ్మ, కోశికె ఐలయ్య, సునీల్, మేతరి అనురాధ, డీఈ సత్యనారాయణ, ఏఈ మల్లికార్జున్, టీపీవో అలీ పాషా, స్థానిక నాయకులు పాల్గొన్నారు.