వికారాబాద్ : వికారాబాద్ ఎస్సై 1 గా విధులు నిర్వహిస్తున్న శ్రీను నాయక్ శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వికారాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాన్య తండాకు చెందిన శ్రీనునాయక్(28) ఇటీవల వికారాబాద్లో ప్రొబేషనరీ ఎస్సైగా పని చేశాడు. డిసెంబర్ 13న వికారాబాద్ ఎస్సై 1గా పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే వివాహం కుదిరింది. వివాహం కోసం డిసెంబర్ 23నుంచి జనవరి 11వరకు 20రోజులు సెలవు పెట్టాడు. డిసెంబర్ 26న హైదరాబాద్లో వివాహం జరిగింది. శనివారం వివిధ పనుల నిమిత్తం నల్గొండ జిల్లాలో ఆటోలో తండ్రితో పాటు ప్రయాణిస్తున్నాడు.
ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టడంతో తండ్రితో పాటు ఎస్సై శ్రీనునాయక్ మృతి చెందాడు. వివాహం జరిగి వారం రోజులు కూడా కాలేదు శ్రీనునాయక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తోటి సిబ్బంది కన్నీరు మున్నీరు అయ్యారు.