పెద్దేముల్ : వైకుంఠధామ నిర్మాణంలో భాగంగా పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా జెడ్పీ సీఈఓ జానకీరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కందనెల్లి గ్రామాన్ని తనిఖీ చేసి గ్రామంలోని మురుగు కాల్వలు, వన నర్సరీ, కంపోస్టు షెడ్డు, వైకుంఠధామం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న పరిశుభ్రత పనులను, ఉపాధ్యాయుల హాజరు పట్టికను స్థానిక సర్పంచ్ మోహన్ రెడ్డి, మండల ఎంపీడీవో లక్ష్మప్పతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పెండింగ్లో ఉన్న ప్రతి పనిని త్వరగా పూర్తి చేయాలన్నారు.
ముఖ్యంగా గ్రామ పంచాయతీల పరిధిలో నూతనంగా నిర్మించిన కంపోస్టు షెడ్డును అన్ని గ్రామ పంచాయతీల్లో తప్పనిసరిగా వినియోగించాలని, వైకుంఠధామాల నిర్మాణాల్లో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి వాటిని కూడా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 1నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు లేకపోగా అందులో ఒకరు సీఎల్ పెట్టగా, మరోకరు సీఎల్ పెట్టకుండానే సెలవులో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా విద్యాధికారి రేణుకాదేవితో ఫోన్లో మాట్లాడి ఉపాధ్యాయులపై శాఖ పరంగా క్రమ శిక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పాఠశాలల పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా సెలవులు పెట్టడం సబబు కాదని ఉపాధ్యాయులతో అన్నారు. తనిఖీల సమయంలో ఆయన వెంట స్థానిక సర్పంచ్ మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ మధులత, ఎంపీడీవో లక్ష్మప్ప, టీఏ విజయ్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.