పెద్దేముల్ : అభివృద్ధికి అడ్డువస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని జిల్లా జడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో లక్ష్మారెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వస్తున్న నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు షాపింగ్కాంప్లెక్స్ శిలా ఫలకాన్ని బండరాయితో ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ సుమారు రూ. కోటి జడ్పీ నిధులతో మండలంలో 5 గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వస్తే కొందరు దుష్టశక్తులు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
ధ్వంసం చేసిన వ్యక్తులు, చేయించిన వ్యక్తులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని, దమ్ముంటే అభివృద్ధి పనుల్లో పోటీ పడాలని, ఇప్పటి నుంచి ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా తగ్గేది లేదని అన్నారు. ముఖ్యంగా నాయకులు, కార్యకర్తలు ఏ విషయంలో కూడా భయపడొద్దని, అందరికీ అండగా ఉంటానని, రానున్న రోజుల్లో వారంలో రెండు రోజులు అన్ని మండలాల్లోని గ్రామాల్లో పర్యటిస్తానని అన్నారు. శిలాఫలకం ధ్వంసం చేయడం చిల్లర పనులను నాంది అన్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని, జిల్లాలో ప్రతి గ్రామాన్ని జెడ్పీనిధులతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాబోవు రోజుల్లో మా తడాఖా ఏంటో చూపిస్తానని అన్నారు.
అభివృద్ధి కొరకు పోరాటం ఎల్లప్పుడు ఉంటుందని, అభివృద్ధికి అడ్డువస్తే ఊరుకునేది, భయపడేది లేదని సవాల్ విసిరారు. కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమళ్గుప్తా, తట్టేపల్లి, పెద్దేముల్ సొసైటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బల్వంత్ రెడ్డి, పార్టీ యువనాయకులు మహిపాల్ రెడ్డి, తాండూరు జడ్పీటీసీ రవిగౌడ్, బషీరాబాద్ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.