వికారాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): భారతీయ రాష్ట్ర సమితిలో వివిధ పదవులు అనుభవించి కాంగ్రెస్లో చేరిన పట్నం మహేందర్రెడ్డి కుటుంబానికి ఆ పార్టీ షాకిచ్చింది. హస్తం పార్టీలో చేరి 24 గంటలు గడవక ముందే జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డిపై బీఆర్ఎస్ జడ్పీటీసీలు అవిశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు శనివారం జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ను కలిసి జడ్పీ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూ 12మంది బీఆర్ఎస్ జడ్పీటీసీలు నోటీసు అందజేశారు. జిల్లాలో మొత్తం18 మంది సభ్యు లుం డగా.. వారిలో 12 మంది మద్దతుతో బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాసం ప్రకటించింది.
మరో ఇద్దరు జడ్పీటీసీలు కూడా ఆ పార్టీకే మద్దతుండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాసం నెగ్గేలా పక్కా వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్నది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దేముల్, బంట్వారం జడ్పీటీసీలు గెలుపొందగా.. అసెంబ్లీ ఎన్నికల సమయం లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన బషీరాబాద్ జడ్పీటీసీ కాంగ్రెస్లో చేరగా శుక్రవారం జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి హస్తం పార్టీలో చేరారు. అవిశ్వాస నోటీసు ఇచ్చిన 14 రోజుల్లోగా బలపరీక్షకు మీటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మరీ ఆ లోగా జడ్పీ చైర్పర్సన్పై అవిశ్వాసానికి సంబంధించి కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే..
కాంగ్రెస్లో చేరిన జడ్పీ చైర్పర్సన్పై బీఆర్ఎస్ జడ్పీటీసీలు అవిశ్వాసం ప్రకటించడం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయంగా కలకలం రేగింది. శుక్రవారం కాంగ్రెస్లో చేరడం, మరుసటి రోజే అవిశ్వాసం ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా అంతటా ఇదే చర్చ జరుగుతున్నది. జడ్పీ చైర్పర్సన్పై అవిశ్వాస నోటీసు ఇచ్చిన వారిలో వికారాబాద్, పరిగి, మర్పల్లి, ధారూరు, నవాబుపేట, దౌల్తాబాద్, దోమ, కులకచర్ల, మోమిన్పేట, పూడూరు, కొడంగల్, తాండూరు జడ్పీటీసీలు సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానాన్ని అదనపు కలెక్టర్కు అందించారు. జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
కాంగ్రెస్లో చేరిన సునీతారెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ సభ్యత్వానికి, జడ్పీ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేయకుండా ఇంకా ఆ పదవిలోనే కొనసాగుతుండడంతో ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని అదనపు కలెక్టర్ను కలిశాం. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది త్యాగాల అనంతరం రాష్ర్టాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత టీడీపీలో ఉన్న పట్నం మహేందర్రెడ్డి దంపతులు బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా, రెండుసార్లు జడ్పీ చైర్పర్సన్గా.. ఎమ్మె ల్సీ పదవులను అనుభవించి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశారు. మహేందర్రెడ్డి కుటుంబంతో ఈ ప్రాంతానికి ఎలాంటి లాభం చేకూరలేదు. బేషరతుగా మహేందర్రెడ్డి ఎమ్మెల్సీ పదవికి, నోటీసు అందకముందే జడ్పీచైర్పర్సన్ పదవికి సునీతారెడ్డి రాజీనామా చేయాలి. బీఆర్ఎస్లో వివిధ పదవులను అనుభవించి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని జడ్పీటీసీలు జీర్ణించుకోలేకపోతున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడం ఖాయం.