షాద్నగర్ : మారుమూల పల్లెలు సహితం అభివృద్ధి వైపు పయనిస్తున్నాయి. పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయి. మెరుగైన వసతులతో పాటు రవాణ వ్యవస్థ బలోపేతం కావడంతో గ్రామాలు ఆర్థికంగా వృద్ధి చెందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెపట్టిన పల్లె ప్రగతి పథకం ఫలితాలు కండ్ల ముందు కనిపిస్తుడంతో పల్లె వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సామన్య ప్రజలకు అవసరమయ్యే కనీస వసతులతో పాటు పర్యవరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన పెంచుతున్నారు.
పల్లెప్రగతి పథకంతో మారుమూల గ్రామామైన ఫరూఖ్నగర్ మండలం చింతగూడ గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో 1578మంది ప్రజలు జీవనం సాగిస్తుండగా సుమారు 310 నివాసాలు ఉన్నాయి. 10కి పైగా కాలనీల్లో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా గ్రామంలో వ్యవసాయ, పారిశ్రామికరంగంపై ఉపాధి పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి ద్వారా గ్రామంలో శుభ్రతతో పాటు పచ్చదనం ఆవరించి స్వచ్ఛమైన వాతావరణం నెలకొందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.
పుష్కలంగా నిధులు
ఫరూఖ్నగర్ మండలం చింతగూడ గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పల్లె ప్రగతి ద్వారా ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి అయ్యాయి. నాలుగు విడతల పల్లెప్రగతిలో గ్రామంలో సుమారు రూ. 80 లక్షల నిధులను ఖర్చు చేశారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండ రూ. 13.50లక్షలను వెచ్చించి విద్యుత్ వ్వవస్థను ఆధునీకరించారు. గ్రామంలో రూ. 2లక్షల నిధులను వెచ్చించి పల్లె ప్రకృతి వనాన్ని అభివృద్ధి చేశారు. సుమారు 4వేలకు పైగా వివిధ రకాల చెట్లను పెంచుతున్నారు. గ్రామ పరిధిలో ఇప్పటికి 8వేలకు పైగా మొక్కలను హరితహారం పథకం ద్వారా నాటి పెంచుతున్నారు. గ్రామ పరిశుభ్రతలో భాగంగా నిత్యం నలుగురి సిబ్బంది ద్వారా చెత్తను సేకరించి చెత్త డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
గ్రామ అవసరాల కోసం రూ. 13 లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, నీళ్ల ట్యాంకర్ను కొనుగోలు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు అవసరమయ్యే విధంగా రూ. 8.5లక్షలతో వైకుంఠ ధామాన్ని నిర్మించారు. ఐదు కాలనీల్లో రూ. 20లక్షలను ఖర్చుచేసి సీసీ రోడ్లను ఏర్పాటు చేశారు. రూ. 8లక్షలతో నాలుగు కాలనీల్లో అంతర్గత మురుగు కాలువలను నిర్మించారు. సుమారు 360 నివాసాలకు తాగునీళ్లను సరఫరా చేసేందుకు 80వేల లీటర్ల మిషన్ భగీరథ ట్యాంకులను అందుబాటులోకి తెచ్చారు. ఇంటింటికీ నల్లాను బిగించారు. సుమారు 10కాలనీల్లో ప్రతి ఇంటి వద్ద మొక్కలను నాటి పెంచుతున్నారు. గ్రామానికి వచ్చె ప్రధాన దారికి ఇరువైపుల విస్తృతంగా చెట్లను పెంచుతున్నారు. రూ. 1.50 లక్షల నిధులతో గ్రామంలో భారీ ఇంకుడు గుంతను ఏర్పాటు చేశారు. పాడుపడిన బావులను, గుంతలను పూడ్చారు. పల్లె ప్రగతి ద్వారా పల్లెలు శుభ్రంగా మారడంతో పాటు అభివృద్ధి పనులు పూర్తికావడం పై గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.