దోమ, నవంబర్ 28 : రైతులు పండించిన పంటలను ఆరబెట్టుకోవడానికి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కల్లాల నిర్మాణానికి అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కల్లాల నిర్మాణం కొద్ది రోజులకే కనుమరుగై కలగా మిగిలిపోనుంది. దోమ మండల పరిధిలోని 36 గ్రామపంచాయతీలోలని 185 మంది రైతులకు కల్లాల నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. అందులో 55 మంది రైతులు కల్లాల నిర్మాణం పూర్తి చేసుకోగా.. పలు కారణాలతో 70 కల్లాల నిర్మాణం సగంలో ఆగిపోయాయి. వాటికి డబ్బులు వస్తాయా లేదా అన్న సందిగ్ధంలో రైతన్నలు కొట్టుమిట్టాడుతున్నారు.
మిగతా 60 కల్లాల నిర్మాణం ప్రారంభానికి నోచుకోలేదు. ప్రారంభం కాని కల్లాలకు అవకాశం లభిస్తుందా లేదా.. అసలు ఈ కల్లాల నిర్మాణం పూర్తి చేసుకొని పంటలను ఆరబెట్టుకునే సౌకర్యాన్ని పొందగలమా అని కొంత మంది రైతులు ఎదురుచూస్తుండగా.. మరికొంత మంది రైతులు కొత్త కల్లాల అనుమతి కోసం నిరీక్షిస్తున్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకంలో మార్పులు తీసుకురావడంతో రైతులు కల్లాలను నిర్మించడానికి అవకాశం లేకుండా పోయింది. కల్లాలు లేక ఏమీ చేయలేని పరిస్థితుల్లో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రోడ్లు ఎక్కే పరిస్థితి నెలకొన్నది. రోడ్లపై ధాన్యం ఆరబోస్తే వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. ఏదైనా ప్రమాదం జరిగితే రైతులే బాధ్యత వహించాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఉపాధి పథకంలో సవరించిన మార్పుల కారణంగా కల్లాల నిర్మాణ ఆప్షన్ను కేంద్రం సాఫ్ట్వేర్ నుంచి తీసివేసింది. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
పూర్తయిన కల్లాలకు బిల్లులు చెల్లించాలి
– ముస్రిప్ప మల్లేశం, రైతు, గంజిపల్లి
ఉపాధి హామీ పథకంలో కల్లానికి దరఖాస్తు చేసుకోగా మంజూరైందని చెప్పడంతో హడావుడిగా కల్లం నిర్మాణం కోసం డబ్బులు వడ్డీకి తెచ్చి పనులు చేపట్టి పూర్తి చేశాను. దానికి సంబంధించిన బిల్లులు రాక.. తెచ్చిన డబ్బులకు మిత్తులు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నాను. సంబంధిత అధికారులను ఎన్నిసార్లు అడిగినా పేమెంట్లు కావడం లేదని చెబుతున్నారు. ఇకనైనా కేంద్రం రైతులు వేసుకున్న కల్లాలకు బిల్లులు వచ్చేలా చర్యలు చేపట్టాలి.
రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం
– దోమ మండల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు సత్యయ్య
కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో రైతులను కల్లాలు వేసుకోమని అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి.. కల్లాలు నిర్మించిన తరువాత వారికి బిల్లు చెల్లించకుండా నిలిపివేసి అన్యాయంచేస్తున్నది. బిల్లులు చెల్లించకుంటే ధర్నాలు చేపడు తాం. రైతులపై నిర్లక్ష్య వైఖరిని మానుకొని న్యాయం చేయాలి.
కల్లాల నిర్మాణానికి దరఖాస్తులు తీసుకోవాలి
– సంపల్లి మల్లేశం, రైతు, మోత్కూర్
కల్లాలు పూర్తి చేసుకున్న రైతులకు బిల్లులు చెల్లించడంతోపాటుగా కొత్త రైతులకు కల్లాలు వేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో వెసులుబాటు కల్పించాలి. కల్లాలు లేక రైతులు రోడ్లపై ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ఉపాధి హామీ పథకంలో తీసుకువచ్చిన కొత్త మార్పుల్లో కూడా కల్లాల నిర్మాణాన్ని చేర్చి రైతులకు మేలు చేయాలి.
కొత్త సాఫ్ట్వేర్లో ప్రొవిజన్ లేనందునే బిల్లులు ఆగాయి
– దోమ మండల అభివృద్ధి అధికారి జయరాం
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో రైతులు కల్లాలు నిర్మించుకోగా వాటికి సంబంధించిన బిల్లులు నిలిచిపోయిన మాట నిజమే. కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో మార్పులు చేయడంతో కొత్త సాఫ్ట్వేర్లో ప్రొవిజన్ లేక పోవడంవల్లనే బిల్లులు ఆగిపోయినాయి. ప్రభుత్వం కొత్త సాఫ్ట్వేర్లో ప్రొవిజన్ ఇచ్చిన వెంటనే బిల్లులు పూర్తి స్థాయిలో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం.